- ఉభయ సభల ప్రసంగంలో తమిళి సై కీలక వ్యాఖ్యలు!
Governor Speech | తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా శుక్రవారం రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఉభయ సభలను ఉద్దేశించి మాట్లాడారు.
ఈ ప్రసంగంలో గవర్నర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజాకవి కాళోజీ కవితతో ప్రసంగాన్ని ప్రారంభించిన గవర్నర్.. కొత్త ప్రభుత్వానికి, ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేలకు అభినందనలు తెలిపారు.
తెలంగాణ నియంతృత్వ పాలన, పోకడల నుంచి విముక్తి పొందిందని వ్యాఖ్యానించారు. పదేళ్ల నిర్బంధ పాలన నుంచి విముక్తి కావాలనీ, తన బతుకుల్లో గొప్ప మార్పు రావాలని కోరుకున్న తెలంగాణ ప్రజలు ఇటీవల ఎన్నికల్లో సుస్పష్టమైన తీర్పు ఇచ్చారని పేర్కొన్నారు.
వారి విజ్ఞతను అభినందిస్తున్నానన్నారు. తన ప్రభుత్వంలో తెలంగాణ స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటోందని చెప్పారు. నిర్బంధాన్ని సహించబోమని ప్రజలు తీర్పు చెప్పారని తెలిపారు. ఈ తీర్పు పౌర హక్కులకు, ప్రజాస్వామ్య పాలనకు నాంది అయ్యిందని అభిప్రాయపడ్డారు.
ప్రజలకు, పాలకులకు మధ్య ఉన్న ఇనుప కంచెలు తొలగిపోయాయన్నారు. అడ్డుగోడలు,అద్దాల మేడలు పటాపంచలై ప్రజా ప్రభుత్వ ప్రస్థానం మొదలైందని చెప్పడానికి గర్విస్తున్నానని చెప్పారు గవర్నర్ తమిళసై సౌందరరాజన్.