T Congress Targets BCs | తెలంగాణలో ఈ సారి ప్రభుత్వం ఏర్పాటు చేయాలనే సంకల్పంతో ఉంది కాంగ్రెస్ పార్టీ (Congress Party).
కర్ణాటక విజయంతో రెట్టించిన ఉత్సాహం వచ్చింది. దీంతో తెలంగాణలో ఉన్న సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తోంది.
ఈ మేరకు పార్టీ సరికొత్త వ్యూహాలకు పదునుపెడుతుంది. ముఖ్యంగా బీసీలను టార్గెట్ చేస్తూ, వారిని ఆకట్టుకునే వ్యూహాలతో ముందుకెళ్లాలని చూస్తోంది.
మరోవైపు కర్ణాటక (Karnataka) అసెంబ్లీ ఎన్నికల విజయం నేర్పిన పాఠాలతో తెలంగాణలోనూ ఆ తరహా హామీలు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ యోచిస్తున్నట్లు సమాచారం.
ఈ నేపథ్యంలో ఆదివారం గాంధీభవన్ లో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth Reddy) అధ్యక్షతన టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం జరిగింది.
ఈ భేటీలో రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు ఎటువంటి కార్యచరణతో ప్రజల్లోకి వెళ్లాలనే అంశంపై చర్చించారట.
అందులో భాగంగా తెలంగాణలో ప్రతి లోకసభ నియోజకవర్గ పరిధిలో రెండు అసెంబ్లీ సీట్లను బీసీ నాయకులకు కేటాయించాలని భేటీలో నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
ఈ నిర్ణయాన్ని త్వరలో జరగబోయే బీసీ డిక్లరేషన్ (BC Decleration) లో ప్రకటించాలని నాయకులు తుది నిర్ణయానికి వచ్చారట.
అంతే కాకుండా బీసీ డిక్లరేషన్ కు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) మరియు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య (Siddaramaiah)ను ముఖ్య అతిథులుగా ఆహ్వానించాలని నేతలు యోచిస్తున్నారు.
అదేవిధంగా ఆగస్ట్ 15న ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ డిక్లరేషన్ ను భారీ సభ ద్వారా ప్రకటించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఈ సభకు ఏఐసీసీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun Kharge)ను ఆహ్వానించనున్నారట.
మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు (Jupally Krishna Rao) కాంగ్రెస్ పార్టీ చేరిక సందర్భంగా జూలై 30న కొల్లాపూర్ వేదికగా భారీ సభ నిర్వహించాలని కాంగ్రెస్ ప్లాన్ చేస్తోంది.
ఈ సభకు ముఖ్య అతిథిగా ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) హాజరవనున్నారు. ఈ సభలో మహిళా డిక్లరేషన్ ను ప్రకటించనున్నట్లు వారు తెలిపారు.
అంతే కాకుండా ఇటీవల ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Komatireddy Venkat Reddy) ఇంట్లో జరిగిన సమావేశంలో నేతలందరూ కలిసి బస్సు యాత్ర చేయాలని నిర్ణయించారు.
ఈ తరుణంలో నిన్న జరిగిన పీఏసీ సమావేశంలో చర్చించారు. నేతల ఐక్యతను చాటే విధంగా బస్సు యాత్రను పార్టీ ప్లాన్ చేస్తున్నారు.
బస్సు యాత్ర ద్వారా పార్టీ అధికారంలోకి వస్తే ప్రజలకు ఏం చెయ్యనున్నారో పార్టీ నాయకులు ప్రచారం చేయనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.