Reventh Reddy Meets Amith Shah | ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా రేవంత్రెడ్డి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్షాను ఢిల్లీ నార్త్ బ్లాక్లోని ఆయన కార్యాలయంలో గురువారం సాయంత్రం కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి చెందిన పలు అంశాలను అమిత్షా దృష్టికి ముఖ్యమంత్రి తీసుకెళ్లారు.
తెలంగాణ రాష్ట్రానికి అదనంగా ఐపీఎస్ అధికారులను కేటాయించాలని కేంద్ర హోం శాఖ మంత్రి శ్రీ అమిత్ షాకు ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణకు కేవలం 76 మంది ఐపీఎస్ అధికారులను కేటాయించారని తెలిపారు.
జిల్లాల విభజన, వివిధ శాఖల పర్యవేక్షణ నిమిత్తం రాష్ట్రానికి అదనంగా 29 అదనపు ఐపీఎస్ పోస్టులు కేటాయించాలని కేంద్ర మంత్రిని ముఖ్యమంత్రి కోరారు. ముఖ్యమంత్రి విజ్ఞప్తికి కేంద్ర మంత్రి శ్రీ అమిత్ షా సానుకూలంగా స్పందించారు. 2024లో కొత్తగా వచ్చే ఐపీఎస్ బ్యాచ్ నుంచి తెలంగాణకు అధికారులను అదనంగా కేటాయిస్తామని హామీ ఇచ్చారు.
రాష్ట్ర పునర్విభజన చట్టం తొమ్మిదో షెడ్యూల్లో పేర్కొన్న సంస్థల విభజనను పూర్తి చేయాలని, పదో షెడ్యూల్ పరిధిలోని సంస్థల వివాదాన్ని పరిష్కరించాలని, న్యూఢిల్లీ లోని ఉమ్మడిరాష్ట్ర భవన్ విభజనను సాఫీగా పూర్తి చేయాలని, చట్టంలో ఎక్కడా పేర్కొనకుండా ఉన్న సంస్థలను ఆంధ్రప్రదేశ్ క్లెయిమ్ చేసుకోవడం విషయంపై దృష్టి సారించాలని కేంద్ర హోం శాఖ మంత్రికి ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు.
తెలంగాణలో యాంటీ నార్కోటిక్స్ బ్యూరో బలోపేతానికి రూ.88 కోట్లు, తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో బలోపేతానికి రూ.90 కోట్లు అదనంగా కేటాయించాలని కేంద్ర హోం శాఖ మంత్రిని ముఖ్యమంత్రి కోరారు. రాష్ట్ర విభజన తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హైదరాబాద్లోని రాజ్భవన్, హైకోర్టు భవనం, లోకాయుక్త, ఎస్హెచ్ఆర్సీ వంటి భవనాలను వినియోగించుకున్నందున ఆ రాష్ట్రం నుంచి వడ్డీతో కలిపి మొత్తం రూ.408 కోట్లు ఇప్పించాలని కేంద్ర హోం శాఖ మంత్రిని ముఖ్యమంత్రి కోరారు.