Telangana Bandh On Oct 14 | రాజ్యసభ సభ్యులు ఆర్. కృష్ణయ్య కీలక ప్రకటన చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవోపై రాష్ట్ర హైకోర్టు స్టే విధించిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో స్పందించిన కృష్ణయ్య బీసీ రిజర్వేషన్ల అంశంలో రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని మండిపడ్డారు.
ఇందుకు నిరసనగా అక్టోబర్ 14న తెలంగాణ బంద్ నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఈ అంశంపై ఇప్పటికే బీసీ సంఘాలు రౌండ్ టేబుల్ సమావేశాలు, మీటింగులు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. తెలంగాణ బంద్ కు రాజకీయ పార్టీలు, కుల సంఘాలు మద్దతు ఇవ్వాలని కోరారు. అలాగే కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని కలిసి బంద్ కు మద్దతు ఇవ్వాలని కోరినట్లు తెలిపారు. పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని కిషన్ రెడ్డి చెప్పారని కృష్ణయ్య వివరించారు.










