Tamil Nadu Governor RN Ravi Sparks Controversy, Asks Students To Chant ‘Jai Shri Ram’ | తమిళనాడు గవర్నర్ ఆర్.ఎన్. రవి మరో వివాదంలో చిక్కుకున్నారు. విద్యార్థులతో బలవంతంగా జై శ్రీరామ్ నినాదం చెప్పించారని అధికార డీఎంకే, కాంగ్రెస్, కమ్యూనిస్టు నేతలు గవర్నర్ పై ఫైర్ అవుతున్నారు.
గవర్నర్ రవి మదురైలోని థియాగరాజర్ ఇంజనీరింగ్ కాలేజీలో జరిగిన “కంబన్ ఇన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్” అనే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో సాహిత్య పోటీల విజేతలకు బహుమతులు పంపిణీ చేశారు.
అనంతరం కంబన్ రామాయణం రచయిత అయిన తమిళ కవి కంబన్ ను స్మరిస్తూ, గవర్నర్ తన ప్రసంగంలో కంబ రామాయణం యొక్క సాంస్కృతిక ప్రాముఖ్యతను గురించి మాట్లాడారు. ప్రసంగం చివరలో, ఆయన విద్యార్థులను “జై శ్రీ రామ్” నినాదాన్ని మూడు సార్లు చెప్పమని కోరారు.
విద్యార్థులు గవర్నర్ అభ్యర్థన మేరకు నినాదం చేశారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. ఈ నేపథ్యంలో వివాదం రాజుకుంది. డిఎంకె ప్రతినిధి సలీం ధరణిధరన్ గవర్నర్ను “ఆర్ఎస్ఎస్ ప్రతినిధి”గా విమర్శించారు.
ఆయన చర్య భారత రాజ్యాంగంలోని లౌకిక విలువలకు విరుద్ధమని, గవర్నర్ రాజ్యాంగ బాధ్యతలను ఉల్లంఘించారని ఆరోపించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే జెఎంహెచ్ హసన్ మౌలానా గవర్నర్ను “ఆర్ఎస్ఎస్ మరియు బిజెపి యొక్క ప్రచారకర్త”గా అభివర్ణించారు.
సిపిఎం ఎంపీ వెంకటేశన్ “బిజెపి అధ్యక్ష పదవికి నామినేషన్లు ముగిశాయి, అయినా గవర్నర్ ఎందుకు ఈ నినాదాలు చేస్తున్నారు?” అని గవర్నర్ ను ఉద్దేశించి ఎద్దేవా చేశారు.