Srikkanth slams Harshit Rana selection | టీం ఇండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు భారత మాజీ కెప్టెన్, వెటరన్ కృష్ణమాచారి శ్రీకాంత్. మరీ ముఖ్యంగా హర్షిత్ రాణా ఎంపికపై మండిపడ్డారు. టీం ఇండియా ఆస్ట్రేలియా టూర్ నేపథ్యంలో శనివారం బీసీసీఐ జట్టును ప్రకటించిన విషయం తెల్సిందే.
వన్డే మరియు టీ-20 సిరీస్ కోసం హర్షిత్ రాణాను సెలెక్టర్లు ఎంపిక చేశారు. ఈ నేపథ్యంలో స్పందించిన శ్రీకాంత్..ప్లేయర్లను పదే పదే మార్చుతూ సెలెక్ట్ చేయడం మూలంగా ఆటగాళ్లని గందరగోళానికి గురి చేస్తున్నారని విమర్శించారు. యశస్వి జైస్వాల్ ఒకసారి టీంలో ఉంటాడు మరోసారి ఉండడు, సంజు శాంసన్ ను బ్యాకప్ ప్లేయర్ గా ఎంపిక చేశారని పేర్కొన్నారు. జట్టులో హర్షిత్ రాణా ఒక్కడే పర్మినెంట్ ప్లేయర్ గా ఉన్నాడని ఎద్దేవా చేశారు.
గంభీర్ కు ఇష్టమైన వ్యక్తి కాబట్టే హర్షిత్ ను సెలెక్టర్లు ఎంపిక చేస్తున్నారని ఆరోపించారు. పదే పదే ప్లేయర్లను మార్చడం మూలంగా ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తున్నారని అభిప్రాయం వ్యక్తం చేశారు. మంచి ఫార్మ్ లో ఉన్న ప్లేయర్లను ఎంపిక చేయడం లేదు, ఫార్మ్ లో లేని వారిని ఎంపిక చేస్తున్నారని ధ్వజమెత్తారు. 2027 ప్రపంచ కప్ లక్ష్యంగా ఒక బలమైన జట్టును నిర్మించాలని కానీ అలా జరగడం లేదన్నారు. హర్షిత్ రాణా, నితీష్ కుమార్ రెడ్డి వంటి ఆటగాళ్లను సెలెక్ట్ చేసే ఉద్దేశ్యమే ఉంటే ట్రోఫీకి గుడ్ బాయ్ చెప్పాలని బీసీసీఐని ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు.










