Shiv Sena (UBT) to hold ‘Sindoor Raksha’ protest over India vs Pakistan Asia Cup match | దుబాయ్ వేదికగా ఆసియా కప్ కొనసాగుతున్న విషయం తెల్సిందే. ఇందులో భాగంగా ఆదివారం టీం ఇండియా తన చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ తో తలపడనుంది.
అయితే పాకిస్థాన్ తో మ్యాచు నిర్వహించడం పట్ల పలువురు రాజకీయ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. జమ్మూకశ్మీర్ లోని పహల్గాంలో ఉగ్రదాడికి ప్రేరేపించిన, ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న పాకిస్థాన్ తో క్రికెట్ మ్యాచు ఏంటని వారు కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు.
ఇదే సమయంలో శివసేన-యూబీటి నేత, ఎంపీ సంజయ్ రౌత్ కీలక ప్రకటన చేశారు. పహల్గాం ఉగ్రదాడిలో 26 మంది భారతీయ మహిళలు సింధూరాన్ని కోల్పోయారని, వారి ఆవేదన ఇంకా ఆగలేదని రౌత్ పేర్కొన్నారు.
పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని తుడిముట్టించడానికి చేపట్టిన ‘ఆపరేషన్ సింధూర్’ ఇంకా ముగియలేదని తెలిపారు. అయినప్పటికీ ఆదివారం పాకిస్థాన్ తో టీం ఇండియా క్రికెట్ మ్యాచ్ ఆడుతుందని నిర్వాహుకులపై మండిపడ్డారు. బీజేపీ మంత్రుల, నేతల పిల్లలు ఈ మ్యాచును చూసేందుకు కచ్చితంగా వెళ్తారని, ఇది కాషాయ పార్టీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజలకు చేసిన వంచన, ద్రోహం అని ఆరోపించారు.
బీజేపీ చేసిన ద్రోహానికి వ్యతిరేకంగా శివసేన పార్టీ ఆదివారం ‘సింధూర్ రక్ష’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఇందులో భాగంగా మహారాష్ట్రలోని వేలాది మహిళలు ప్రధానమంత్రి నరేంద్రమోదీకి తమ ఇంటి నుంచి సింధూరాన్ని పంపి నిరసన తెలియజేస్తారని సంజయ్ రౌత్ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు.










