Man Sells Gold with Scrap | హర్యానా రాష్ట్రంలోని ఫరీదాబాద్ (Faridabad) లో ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. పేదవాడైనా తన నిజాయతీని చాటకున్నారు ఓ స్క్రాప్ వ్యాపారి. నిజాయతీకి నిదర్శనంగా నిలిచిన ఈ సంఘటన కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఫరీదాబాద్ కు చెందిన అశోక్ శర్మ అనే వ్యక్తి కుటుంబంతో కలిసి గతేడాది జరిగిన ప్రయాగ్ రాజ్ లో జరిగిన కుంభమేళాకు వెళ్లాడు. ఇంటి నుంచి బయలుదేరే ముందు ఇంట్లో దొంగతనం భయం వల్ల ఆభరణాలను ఒక పాత పెట్టెలో పెట్టి చెత్త సంచిలో దాచాడు.
పది నెలల తర్వాత దీపావళి శుభ్రపరిచే సమయంలో ఆ సంచిని తెలియకుండానే చెత్తతో కలిపి స్క్రాప్ వ్యాపారికి అమ్మేశారు. కొన్ని రోజుల తర్వాత ఇంట్లో బంగారం కనిపించకపోవడంతో స్క్రాప్ కు అమ్మేసిన విషయం గుర్తొచ్చింది.
వెంటనే ఆ స్క్రాప్ వ్యాపారి హాజీ అక్తర్ ఖాన్ దగ్గరి వెళ్లి వెతకగా బంగారం దొరకలేదు. కొన్ని రోజుల తర్వాత అక్తర్ ఖాన్ తన గోదాంలో చెత్తను వేరు చేస్తుండగా పాత పెట్టె కనిపించింది. దాన్ని తెరిచి చూడగా సుమారు 100 గ్రాముల బంగారు ఆభరణాలు బయటపడ్డాయి.
వాటి విలువ రూ.15 లక్షలకు పైగా ఉంటుందని అంచనా. వెంటనే శర్మకు సమాచారం ఇచ్చి, అదనపు పోలీసు కమిషనర్ జితేష్ మల్హోత్రా సమక్షంలో ఆభరణాలను తిరిగి అందజేశాడు. ఖాన్ నిజాయితీకి స్థానికులు ప్రశంసలు కురిపిస్తున్నారు.









