Pooja Eeman’s Inspiring Journey | విషాదకరంగా ప్రారంభమైన తన జీవితాన్ని అద్భుత మైలురాళ్ళలను సాధించే విధంగా మలుచుకుంది పూజ ఈమన్. ముళ్లపొదల్లో దొరికిన చిన్నారి నేడు ఐఏఎస్ కావాలనే లక్ష్యాన్ని పెట్టుకుంది. ఈ యువతి కథ 2008లో ప్రారంభమయ్యింది.
తిరుపతి సమీపంలోని రేణిగుంటలో ఓ మతిస్థిమితం లేని మహిళ శిశువుకు జన్మనిచ్చింది. అనంతరం శిశువును ముళ్లపొదల్లో పడేసింది. ఇది గమనించిన స్థానికులు శిశువును రక్షించి వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు లోని రాజా ఫౌండేషన్ కు సమాచారమిచ్చారు. ఫౌండేషన్ సిబ్బంది వచ్చి పాపను రక్షించి తమ వెంట తీసుకెళ్లారు.
అనంతరం బాలికకు మంచి పేరు పెట్టాలని ఫౌండేషన్ ఛైర్మన్ రాజారెడ్డి మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం కు లేఖను రాశారు. అబ్దుల్ కలాం పూజ ఈమన్ అని నామకరణం చేశారు. రాజా ఫౌండేషన్ అధినేత రాజారెడ్డి పూజ పేరు మీద ఒక ఇంటర్నేషనల్ స్కూల్ ను ప్రారంభించారు. ఈ పాఠశాలలోనే చదివిన పూజ పదవ తరగతిలో ఐదు వందల మార్కులకు గాను 428 మార్కులు సాధించింది.
అనంతరం ఫౌండేషన్ సహకారంతో హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఇంటర్మీడియట్ కాలేజీలో ఇంటర్ పూర్తి చేసింది. ఇందులో 1000 మార్కులకు గాను 985 మార్కులు సాధించింది. పూజా చదువులో మాత్రమే కాకుండా క్రీడలు మరియు కళలలో కూడా ప్రతిభను కనబరిచింది. ఆమె చిత్రకళలో అనేక అవార్డులను గెలుచుకుంది, మరియు స్విమ్మింగ్ లో జిల్లా మరియు రాష్ట్ర స్థాయిలలో రాణించి, రెండుసార్లు జాతీయ స్థాయిలో తెలంగాణకు ప్రాతినిధ్యం వహించింది.
కానీ పూజను తీర్చిదిద్దిన రాజా రెడ్డి, ఆమె ఇంటర్మీడియట్ కోర్సు సమయంలో కన్నుమూశారు. రాజారెడ్డి మరణం తనను ఎంతో కలిచివేసిందని పూజ భావోద్వేగానికి లోనయ్యింది. అనాథ అనే భావన కలగకుండా రాజారెడ్డి సర్ తనను పెంచారని, తాను కలెక్టర్ కావాలనేదే సర్ కల అని కచ్చితంగా రాజారెడ్డి సర్ కలను నెరవేరుస్తానని పూజ తెలిపారు.