Ponnam Prabhakar Denies Rift With Adluri Laxman | తెలంగాణ ప్రభుత్వంలోని మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ మధ్య మాటల యుద్ధం చోటుచేసుకోవడం సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో పొన్నం ప్రభాకర్ కీలక ప్రకటన చేశారు.
మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తనకు సోదరుడితో సమానం అని కాంగ్రెస్ పార్టీలో తమ మధ్య 30 సంవత్సరాలుగా ఉన్న స్నేహబంధం రాజకీయాలకు మించినదే అని పేర్కొన్నారు. తమ మధ్య ఉన్న అనుబంధం, పరస్పర గౌరవం ఎప్పుడూ అలాగే కొనసాగుతుందని ఎవరు విడదీయలేరని తెలిపారు. తాను మంత్రి అడ్లూరిపై ఎటువంటి వ్యక్తిగత వ్యాఖ్యలు చేయలేదని అట్టడుగు స్థాయి నుంచి వచ్చిన వ్యక్తిగా, బీసీ వర్గానికి చెందిన నాయకుడిగా తనకు ఎవరిపైనా అలాంటి అభిప్రాయం ఉండదన్నారు.
అయితే, రాజకీయ దురుద్దేశంతో కొంతమంది తన వ్యాఖ్యలను వక్రీకరించి, వాస్తవానికి భిన్నంగా ప్రచారం చేశారని వివరించారు. దాంతో ఏర్పడిన అపార్థాల వల్ల అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మనసు నొచ్చుకుందని తెలిసి తాను తీవ్రంగా విచారిస్తున్నట్లు మంత్రి పొన్నం వెల్లడించారు. అడ్లూరి లక్ష్మణ్ మనసు నొచ్చుకొని ఉంటే చింతిస్తున్నట్లు ప్రకటన చేశారు.
కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను బలోపేతం చేయడంలో,రాహుల్ గాంధీ నాయకత్వంలో సామాజిక న్యాయం సాధనలో, ప్రజల అభ్యున్నతికై తాము ఇద్దరం కలిసికట్టుగా కృషి చేస్తామని స్పష్టం చేశారు. ఇదే సమయంలో వీరిద్దరి మధ్య విభేదాలను తొలగించేందుకు అధిష్టానం ప్రయత్నాలు చేస్తోంది. ఈ మేరకు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఈ ఇద్దరితో బుధవారం భేటీ అయ్యారు.









