PM Modi inaugurates 103 Amrit Bharat Stations | ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం రాజస్థాన్లోని బికనీర్ నుంచి వర్చువల్గా దేశవ్యాప్తంగా 103 అమృత్ భారత్ రైల్వే స్టేషన్లను ప్రారంభించారు.
అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద 18 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 86 జిల్లాల్లో ఈ స్టేషన్లను ఆధునీకరించారు. ఇందులో తెలంగాణలోని బేగంపేట, కరీంనగర్, వరంగల్, ఆంధ్రప్రదేశ్లోని సూళ్లూరుపేట రైల్వే స్టేషన్లు కూడా ఉన్నాయి.
ప్రధాని మోదీ ఈ సందర్భంగా మాట్లాడుతూ, అమృత్ భారత్ స్టేషన్లు రైల్వే వ్యవస్థలో కొత్త యుగానికి నాంధి అని అన్నారు. “ఈ స్టేషన్లు ఆధునిక సౌకర్యాలతో పాటు, స్థానిక సంస్కృతిని ప్రతిబింబిస్తాయి. ప్రయాణికులకు సౌకర్యవంతమైన అనుభవాన్ని అందించడమే కాక, దేశంలో రవాణా వ్యవస్థను మరింత బలోపేతం చేస్తాయి” అని పేర్కొన్నారు.
యూపీలో 19, గుజరాత్ లో 18, మహారాష్ట్రలో 15, రాజస్థాన్ లో 8 అమృత్ భారత్ స్టేషన్లను ప్రధాని ప్రారంభించారు. రైల్వే మంత్రిత్వ శాఖ ప్రారంభించిన అమృత్ భారత్ స్టేషన్ పథకం ద్వారా దేశవ్యాప్తంగా 1,300కు పైగా రైల్వే స్టేషన్లను ఆధునిక రవాణా కేంద్రాలుగా మార్చే లక్ష్యంతో పనిచేస్తోంది.
విమానాశ్రయాల తరహాలో అత్యాధునిక సౌకర్యాలతో స్టేషన్లను తీర్చిదిద్దడం ఈ పథకం లక్ష్యం. విశాలమైన ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లు, లిఫ్ట్లు, ఎస్కలేటర్లు, దివ్యాంగుల కోసం ర్యాంపులు, ఆధునిక టికెట్ కౌంటర్లు, వెయిటింగ్ హాల్స్ వంటి సౌకర్యాలు ఈ స్టేషన్లలో ఏర్పాటు చేశారు.










