Parents Celebrate Son Who Failed His Class 10 Exam In Karnataka | పదవ తరగతి పరీక్షల్లో తమ కుమారుడు ఆరుకు ఆరు సబ్జెక్టుల్లో ఫెయిల్ అవ్వడంతో అతడిలో మనోధైర్యం నింపేందుకు తల్లిదండ్రులు చేసిన పనికి సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
కుమారుడికి ధైర్యం చెప్పి, కేక్ కట్ చేయించి తల్లిదండ్రులు వేడుక చేరుకున్నారు. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటుచేసుకుంది. బాగల్కొటే జిల్లా నవనగరకు చెందిన అభిషేక్ బసవేశ్వర ఇంగ్లీష్ మీడియం స్కూల్ లో పదో తరగతి చదివాడు.
ఇటీవల వెలువడిన పదవ తరగతి ఫలితాల్లో అభిషేక్ ఆరు సబ్జెక్టుల్లో ఫెయిల్ అయ్యాడు. 625 మార్కులకు గాను 200 మార్కులు వచ్చాయి. దింతో సహా విద్యార్థులు, ఇరుగుపొరుగు వారు అభిషేక్ ను హేళన చేశారు. దింతో అభిషేక్ బాధపడ్డాడు.
ఇది గమనించిన తల్లిదండ్రులు తనయుడికి మనోధైర్యాన్ని ఇవ్వాలని భావించారు. వెంటనే కేక్ తెప్పించి కట్ చేయించి సంబరాలు జరిపారు. పరీక్షల్లో ఫెయిల్ అయినంతమాత్రనా ఏమీ కాదని, పరీక్షలు మరొకసారి రాసుకోవచ్చని సూచించారు.
తల్లిదండ్రులు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా అని అభిషేక్ చెప్పాడు. ఇటీవల పరీక్షల్లో ఫెయిల్ అవ్వగానే విద్యార్థులు కఠిన నిర్ణయాలు తీసుకుంటున్న విషయం తెల్సిందే. ఈ తరుణంలో అభిషేక్ తల్లిదండ్రులు తనయుడికి ఇచ్చిన మనోధైర్యం పట్ల నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.