Pakistan returns detained BSF Jawan | బీఎస్ఎఫ్ జవాన్ పూర్ణమ్ సాహును పాకిస్థాన్ ఎట్టకేలకు భారత్ కు అప్పగించింది. గత నెలలో సరిహద్దు వెంబడి గస్తీ కాస్తున్న జవాన్ ను పాకిస్థాన్ రేంజర్స్ అదుపులోకి తీసుకున్న విషయం తెల్సిందే.
పంజాబ్లోని ఫిరోజ్పూర్ సెక్టార్లోని భారత్-పాకిస్తాన్ సరిహద్దు వద్ద బీఎస్ఎఫ్ జవాన్ పూర్ణమ్ సాహు ను పాకిస్థాన్ రేంజర్స్ నిర్బంధించాయి. సాహు 182వ బెటాలియన్కు చెందినవారు. అతను సరిహద్దు వెంట స్థానిక రైతుల రక్షణ కోసం గస్తీలో ఉన్నాడు.
ఈ క్రమంలో కాస్త అస్వస్థతకు లోనయ్యి, విశ్రాంతి కోసం పక్కనే ఉన్న చెట్టు కిందకు వెళ్ళాడు. అయితే ఆ చెట్టు పాక్ భూభాగంలో ఉంది. అనుకోకుండా భారత సరిహద్దు కంచెను దాటి పాకిస్తాన్ భూభాగంలోకి ప్రవేశించడంతో పాకిస్తాన్ రేంజర్స్ అతన్ని అదుపులోకి తీసుకున్నాయి. ఈ సంఘటన తర్వాత, BSF మరియు పాకిస్తాన్ రేంజర్స్ మధ్య అట్టారీ-వాఘా సరిహద్దు వద్ద ఫ్లాగ్ మీటింగ్ జరిగింది.
సాహును విడుదల చేయడానికి చర్చలు జరిగాయి. మరోవైపు గర్భిణి అయిన పూర్ణమ్ సాహు సతీమణి తన భర్తను విడిపించాలని కేంద్రాన్ని వేడుకున్నారు. కానీ పై అధికారుల నుండి ఆదేశాలు రాలేదని పాక్ సాకులు చెప్పింది. మే నెల మొదటి వారంలో రాజస్థాన్ శ్రీగంగానగర్ వద్ద ఉన్న సరిహద్దులోకి ఓ పాక్ రేంజర్ చొరబడ్డారు.
ఈ నేపథ్యంలో బీఎస్ఎఫ్ జవాన్లు అతడిని అదుపులోకి తీసుకున్నారు. దీంతో పాక్ పై కూడా ఒత్తిడి పెరిగింది. ఈ తరుణంలో బుధవారం ఉదయం అట్టారీ వాఘా సరిహద్దు వద్ద జవాన్ పూర్ణమ్ సాహును పాకిస్థాన్ భారత్ కు అప్పగించింది.










