Muslim couple from Belagavi hold adopted son’s wedding according to Lingayat rituals | కులమతాలకు అతీతంగా మానవత్వాన్ని చాటి చెప్పిన అద్భుత ఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటుచేసుకుంది. లింగాయత్ ధర్మాన్ని అనుసరించే దంపతులు మరణించిన నేపథ్యంలో వారి కుమారులను దత్తత తీసుకున్నారు ముస్లిం దంపతులు. 20 ఏళ్ల పాటు వారిని కంటికిరెప్పలా కాపాడుకొని తాజగా ఓ కుమారుడికి వివాహం జరిపించారు. అది కూడా లింగాయత్ సంప్రదాయం ప్రకారం. కర్ణాటకలోని హుక్కేరి తాలూకా బెస్తవాడలో మెహబూబ్ హసన్, నూర్జహాన్ దంపతులు నివాసం ఉంటున్నారు. మెహబూబ్ ఆ రాష్ట్ర ఆర్టీసీలో బస్ డ్రైవర్ గా సేవలందించారు. వీరి ఇంటి పక్కనే లింగాయత్ ధర్మాన్ని పాటించే కాడయ్యా, శైల దంపతులు సుమారు 20 ఏళ్ల క్రితం కన్నుమూశారు.
స్నేహితుడు మరణించిన క్రమంలో అతడి పిల్లలు నాలుగేళ్ళ సోమశేఖర్, రెండేళ్ల వసంత్ ను మెహబూబ్ దత్తత తీసుకున్నారు. 20 ఏళ్ల పాటు వారిని పెంచి పోషించారు. తాజగా సోమశేఖర్ కు పూనం అనే యువతితో లింగాయత్ సంప్రదాయం ప్రకారం వివాహం జరిపించారు. ఈ ఘటనకు సంబంధించిన వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. స్నేహితుడు లోకం విడిచినా ఆ స్నేహానికి మరణం లేదని చాటిచెప్పారు మెహబూబ్, నూర్జహాన్ దంపతులు. అనాథలైన స్నేహితుడి పిల్లలను 20 ఏళ్లుగా కంటికి రెప్పలా కాపాడటమే కాదు, వారిని పెంచి, లింగాయత సంప్రదాయం ప్రకారమే ఘనంగా వివాహం జరిపించారు. మనుషుల మధ్య ప్రేమను పంచడానికి మతం అడ్డుకాదు, కులం అడ్డురాదు అని ఈ దంపతులు చేతల్లో చూపించారని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.










