MLC Vijayashanthi Fires On BJP Over HCU Lands | కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమిని వేలం వేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.
అయితే ఈ భూముల్లో చెట్లను తొలగించి, అమ్మకాలు చేయడం ద్వారా పర్యావరణానికి తీవ్ర ముప్పు వాటిల్లుతుందని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు గతకొన్ని రోజులుగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని బీజేపీ, బీఆరెస్ నాయకులు డిమాండ్ చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ విజయశాంతి స్పందించారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పరిసరాల్లో ఉన్న 400 ఎకరాల భూమిని బిల్లీరావుకు చెందిన ఐఎంజి సంస్థకు 2004లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు కేటాయించడం జరిగిందని ఇది తెలంగాణ బీజేపీ దృష్టిలో న్యాయం, సహేతుకమని పేర్కొన్నారు.
ఐఎంజి సంస్థ ఈ 400 ఎకరాల్లో క్రీడా ప్రాంగణం కట్టకుండా.. ఈ భూమిని కొట్టేయాలని ప్రయత్నం చేసినప్పుడు తెలంగాణ బీజేపీ నేతలకు అది అన్యాయం అనిపించలేదని తెలిపారు. ఎందుకంటే 2004 లో బీజేపీ కూటమిలో టీడీపీ ఉన్నప్పుడే ఐఎంజి సంస్థకు చంద్రబాబు 400 ఎకరాల స్థలాన్ని బదలాయించారు కాబట్టి , ఇప్పుడు బీజేపీ నేతలు ప్రస్తావించే తప్పులన్నీ అప్పుడు వాళ్లకు గుర్తు రాలేదని విమర్శించారు.
ప్రస్తుతం ఈ 400 ఎకరాలపై కాంగ్రెస్ ముఖ్యమంత్రులు కొట్లాడి , ఈ భూముల్ని కాపాడి, వాటిని అమ్మి ఆ డబ్బును ప్రభుత్వ ఖజానాలో జమ చేయడం నేరమంటూ తెలంగాణ బీజేపీ నేతలు నానా యాగి చేస్తున్నారని మరి 2004లో ఐఎంజి సంస్థకు ఈ భూముల్ని అప్పచెప్పడం తెలంగాణ బీజేపీ నేతల దృష్టిలో నేరం అనిపించలేదా అని విజయశాంతి నిలదీశారు.