Nara Lokesh Praises Students | తిరుపతి (Tirupati) జిల్లా వెంకటగిరిలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థినులు తమ నిజాయతీని చాటుకున్నారు. దారిలో దొరికిన బంగారం, నగదు ఉన్న పర్సును పోలీసులకు అప్పగించి ఆదర్శంగా నిలిచారు.
దీంతో ఈ విద్యార్థినులను విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) ప్రత్యేకంగా అభినందించారు. వెంకటగిరి జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో చదువుతున్న బి. గురుప్రియ, బి. గీతిక, ఎం. గీతిక, పద్మశ్రీ, హేమలత గురువారం సాయంత్రం పాఠశాల ముగిశాక ఇంటికి బయలుదేరారు.
ఎస్బీఐ బ్యాంకు వద్ద బస్సు కోసం ఎదురుచూస్తుండగా వారికి ఒక పర్సు కనిపించింది. దాన్ని తెరిచి చూడగా అందులో బంగారం, నగదు ఉన్నాయి. దీంతో వెంటనే పోలీస్ స్టేషన్కు వెళ్లి ఆ పర్సును ఎస్సైకి అప్పగించారు.
తిరిగి బస్టాప్కు తిరిగి రాగా, పర్సు పోగొట్టుకున్న మహిళ అక్కడ వెతుకుతూ కనిపించింది. విషయం చెప్పి ఆమెను కూడా పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు. పోలీసులు వివరాలు నిర్ధారించుకుని ఆ పర్సును మహిళకు అందజేశారు.
ఈ ఘటనపై మంత్రి నారా లోకేశ్ స్పందించారు. “చిన్న వయసులోనే మీ నీతివంతమైన ప్రవర్తన ఆదర్శంగా నిలిచింది. మీ నిజాయతీ మన విద్యాశాఖ గౌరవాన్ని మరింత ఇనుమడింపజేసింది. మీకు ఎల్లప్పుడూ అండగా ఉండే అన్నగా నేను గర్విస్తున్నాను. “నిజాయతీలో మా పిల్లలు బంగారం” అని ప్రశంసలు కురిపించారు.










