Medaram Jathara Kova Bun Controversy | మేడారం మహా జాతరలో కోవా బన్ విక్రయిస్తున్న రాయలసీమకు చెందిన షేక్ షావాలిని ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూ చేసిన వీడియో వైరల్ గా మారింది. కోవా బన్ విక్రయిస్తున్న వ్యక్తిపై యూట్యూబర్ ప్రవర్తించిన తీరు పై కొందరు నెటిజన్లు భగ్గుమంటున్నారు. మరికొందరు మాత్రం యూట్యూబర్ కు మద్దతుగా నిలుస్తున్నారు. తాజగా ఈ అంశంపై స్పందించారు టీడీపీ నాయకులు పరిటాల శ్రీరామ్.
‘ఆకలికి కులం ఉండదు, ఆత్మగౌరవానికి మతం ఉండదు. కష్టపడి పనిచేసుకొని కుటుంబాన్ని పోషించుకునే ప్రతీ ఒక్కరినీ గౌరవించాల్సిన బాధ్యత అందరిపై ఉంటుంది. ఒక కోవ బన్ విక్రయించుకునే పేద చిరు వ్యాపారి జీవితాన్ని ఇలా రోడ్డుపైకి లాగడం దారుణం. యూట్యూబ్లో వ్యూస్, లైక్స్ కోసం కొందరు ఇలాంటి పనులు చేస్తున్నారు. వీలైతే పేద వారి పక్షాన నిలబడాలి కానీ ఇలా గొంతు నొక్కడం సరైంది కాదు. ఆ చిరు వ్యాపారికి మద్ధతుగా నిలుస్తూ, ఈ సంఘటనను ఖండిస్తున్న ప్రతీ ఒక్కరికీ నా ధన్యవాదాలు. సోషల్ మీడియాలో ఆ వ్యాపారికి లభిస్తున్న మద్ధతు చూస్తుంటే మానవత్వం ఇంకా బతికుందన్న భావన కలుగుతోంది’ అని ఆయన పేర్కొన్నారు.










