Maoist Sensational Letter To Three States CM’s | ఆయుధాలు వీడి జనజీవన స్రవంతిలో కలిసేందుకు సిద్ధంగా ఉన్నట్లు మావోయిస్టు పార్టీ ప్రకటన చేసింది. ఈ మేరకు పార్టీలోని శ్రేణులకు సమాచారం ఇచ్చేందుకు సమయం పడుతుంది కాబట్టి వచ్చే ఏడాది ఫిబ్రవరి 15 వరకు సమయం ఇవ్వాలని మావోయిస్టు పార్టీ కోరింది.
ఈ మేరకు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్ ఘడ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఎంఎంసీ స్పెషల్ జోనల్ కమిటీ అధికార ప్రతినిధి అనంత్ పేరిట ఓ బహిరంగ లేఖ విడుదల అయ్యింది. ఛత్తీస్ ఘడ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో కూంబింగ్ ఆపరేషన్ నిలిపివేస్తే ఆయుధాలను వదిలివేసే తేదీని ప్రకటిస్తామని లేఖలో అనంత్ స్పష్టం చేశారు. ప్రపంచం, దేశంలో మారుతున్న పరిస్థితుల దృష్ట్యా ఆయుధాలను వీడి తాత్కాలికంగా పోరాటాన్ని నిలిపివేయాలని మావోయిస్టు కేంద్ర కమిటీ, పొలిట్ బ్యూరో సభ్యుడు సోనూ దాదా తీసుకున్న నిర్ణయాన్ని సమర్థిస్తున్నట్లు లేఖలో మావోలు పేర్కొన్నారు.
కేంద్ర కమిటీ సభ్యులు సతీష్ దాదా, చంద్రన్న మరియు ఎంఎంసీ సోనూ దాదా నిర్ణయాన్నీ సమర్థిస్తూ తుపాకులు వీడాలని నిర్ణయించులున్నట్లు స్పష్టం చేశారు. కూంబింగ్ ఆపరేషన్ నిలిపివేసిన మరుక్షణమే ఆయుధాలను వీడనున్నట్లు మావోయిస్టు పార్టీ తెలిపింది. అయితే పార్టీలో సమిష్టి నిర్ణయానికి రావడానికి ఫిబ్రవరి 15 వరకు సమయం కోరింది. ఈ సమయం కోరడం వెనుక మరో ఉద్దేశ్యం లేదని, అంతర్గతంగా చర్చించుకోవడానికి, తుది నిర్ణయానికి రావడానికి మాత్రమే అని అనంత్ లేఖలో స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా ఓ వైపు ఆపరేషన్ కగార్ కొనసాగుతున్న తరుణంలో మావోల లేఖపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో అనేది చర్చనీయాంశంగా మారింది.










