Mallikarjun kharge news latest | కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు, రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లిఖార్జున ఖర్గే తనపై చేసిన ఆరోపణలకు పుష్ప స్టైల్ లో కౌంటర్ ఇచ్చారు.
వక్ఫ్ సవరణ బిల్లును ఎన్డీయే ప్రభుత్వం బుధవారం లోకసభలో ప్రవేశపెట్టిన విషయం తెల్సిందే. ఈ బిల్లుపై చర్చ సందర్భంగా బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ మాట్లాడుతూ..కర్ణాటక రాష్ట్రంలో జరిగిన భూ కుంభకోణంలో అనేకమంది కాంగ్రెస్ నాయకులు ఉన్నారని, రూ.వేల కోట్ల వక్ఫ్ భూములను దుర్వినియోగం చేశారని ఆరోపించారు. అలాగే ఈ కుంభకోణంలో మల్లిఖార్జున ఖర్గే కూడా ఉన్నారని సంచలన ఆరోపణలు చేశారు.
ఈ నేపథ్యంలో గురువారం రాజ్యసభలో మాట్లాడిన ఖర్గే తనపై చేసిన ఆరోపణలకు కౌంటర్ ఇచ్చారు. బీజేపీ నాయకులు తనను బయపెట్టాలని చూస్తున్నారని, కానీ బయపడేదే లేదు, తల వంచేదే లేదు అంటూ ఖర్గే పుష్ప స్టైల్ లో తగ్గేదే లేదు అంటూ కౌంటర్ ఇచ్చారు. తన జీవితం తెరిచిన పుస్తకం అని ప్రజాజీవితంలో అత్యున్నత విలువలను పాటించినట్లు పేర్కొన్నారు.
అనురాగ్ ఠాకూర్ చేసిన ఆరోపనలను నిరూపించాలని లేదంటే సభలో ఉండే హక్కు ఆయనకు లేదన్నారు. ఒకవేళ నిరూపిస్తే తాను రాజీనామా చేస్తానని ఖర్గే స్పష్టం చేశారు. ఇప్పటివరకూ తన వ్యక్తిత్వాన్ని ఎవరూ వేలెత్తి చూపలేదన్నారు. ఎన్ని ఆరోపణలు, బెదిరింపులు చేసినా భయపడేదే లేదని, తగ్గేదే లేదని ఖర్గే వ్యాఖ్యానించారు.