Maha Kumbh Water For Prisoners In UP | ఉత్తర్ ప్రదేశ్ ప్రయాగ్రాజ్ ( Prayagraj ) లో మహా కుంభమేళా కన్నులపండువగా సాగుతుంది. దేశ విదేశాల నుండి వస్తున్న భక్తులతో ప్రాంతం కిక్కిరిపోయింది.
ఇప్పటికే 55 కోట్ల మంది భక్తులు పవిత్ర త్రివేణి సంగమంలో స్నానమాచరించారు. ఇదిలా ఉండగా కుంభమేళాలో పవిత్ర స్నానం చేయాలనుకుంటున్న జైళ్లలో ఉన్న ఖైదీల కోసం యూపీ సర్కార్ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 75 జైళ్లలోని 90 వేల మంది ఖైదీలు గంగా జలంతో స్నానం చేసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ మేరకు ప్రయాగ్రాజ్ త్రివేణి సంగమం నుండి పవిత్ర జలాన్ని సేకరించి రాష్ట్రంలోని జైళ్లకు తరలించనున్నారు.
గంగా జలాన్ని జైళ్లలో ఉండే నీటిలో కలుపుతారు. పవిత్ర స్నానాల అనంతరం పూజలు చేసుకునేందుకు ఖైదీలకు అవకాశం ఇవ్వనున్నట్లు రాష్ట్ర జైళ్ల శాఖ మంత్రి దారా సింగ్ చౌహన్ వెల్లడించారు.