Komatireddy Rajgopal Reddy News | మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో రాజీనామా చేసి అప్పటి బీఆరెస్ ప్రభుత్వాన్ని మునుగోడు ప్రజల వద్దకు తీసుకువచ్చానని అవసరమైతే మళ్లీ అలాంటి త్యాగానికి కూడా సిద్ధమే అని హాట్ కామెంట్స్ చేశారు.
మునుగోడు ప్రజల కోసం త్యాగానికైనా పోరాటానికైనా సిద్ధమే అని పేర్కొన్నారు. ఎవరివో కాళ్ళు పట్టుకుని పదవులు తెచ్చుకోవడం తనకు ఇష్టం ఉండదని, దిగజారి బ్రతకడం తనకు తెలీదన్నారు. నియోజకవర్గ ప్రజలు తలదించుకునే పని ఎప్పటికీ చేయబోనని ఆయన స్పష్టం చేశారు.
2023 శాసనసభ ఎన్నికల సమయంలో హైదరాబాద్ లోని ఎల్బీనగర్ నుంచి పోటీ చేస్తే మంత్రి పదవి ఇస్తామని అధిష్టానం హామీ ఇచ్చిందని కానీ మునుగోడు ప్రజల కోసం వదులుకున్నట్లు తెలిపారు. ఆ తర్వాత పార్లమెంటు ఎన్నికల్లో భువనగిరిలో కాంగ్రెస్ ను గెలిపిస్తే మంత్రి పదవి ఇస్తామని చెప్పారని వ్యాఖ్యానించారు.
పదవి ఇస్తారా లేదా అనేది అధిష్టానం ఇష్టం. ఇతర పార్టీల నుంచి వచ్చినవారికి, తనకంటే జూనియర్లకు మంత్రి పదవులు వచ్చాయని పేర్కొన్నారు. స్వార్ధం కోసం మంత్రి పదవి అడగడం లేదని, తనకు మంత్రి పదవి వస్తే ప్రజలకే మంచి జరుగుతుందన్నారు. తాను అందరిలా పదవులు అడ్డుపెట్టుకుని సంపాదించేవాడిని కాదని కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.










