Kishan Reddy Emergency Delhi Tour | కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి ఆదివారం హుటాహుటిన ఢిల్లీకి బయలుదేరారు. ముందుగా నిర్ణయించిన కార్యక్రమాలను రద్దు చేసుకుని మరీ ఆయన హస్తినకు వెళ్లడం ఆసక్తిగా మారింది.
షెడ్యూల్ సైతం రద్దు చేసుకుని కిషన్ రెడ్డి ఢిల్లీకి వెళ్లడం పట్ల రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అతి త్వరలో తెలంగాణకు బీజేపీ నూతన అధ్యక్షుడ్ని జాతీయ నాయకులు ప్రకటిస్తారని ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో కిషన్ రెడ్డి హస్తినకు రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవిపై చర్చించడానికే వెళ్ళారా లేదా మరేదైనా అత్యవసర సమావేశం కోసం వెళ్ళారా అనేది తెలియాల్సి ఉంది.
కాగా శనివారం చెన్నై వేదికగా జరిగిన ‘ఫెయిర్ డీలిమిటేషన్’ సదస్సుపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. డీలిమిటేషన్ పై కేంద్రం ఇంత వరకూ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, విధి విధానాలపై పార్లమెంటు లేదా కేబినెట్ లో చర్చించలేదని పేర్కొన్నారు. కానీ బీఆర్ఎస్, కాంగ్రెస్ దీన్ని పెద్ద సమస్యగా చిత్రీకరిస్తున్నాయని విమర్శించారు. చెన్నై వేదికగా వీరి పాత స్నేహం మరోసారి బయటపడిందని కిషన్ రెడ్డి తెలిపారు.