Hyd CP Sajjanar Request | సంక్రాంతి (Sankranthi) పండుగ నేపథ్యంలో హైదరాబాద్ (Hyderabad) నుంచి ప్రజలు, ఏపీ వాసులు పెద్ద ఎత్తున స్వస్థలాలకు పయనమవుతున్నారు. శనివారం నుంచి స్కూళ్లకు సెలవులు ప్రకటించడంతో రేపటి నుంచి భారీగా వాహనాలు బయలుదేరనున్నాయి.
ఈ నేపథ్యంలో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ (Hyderabad Police Commissioner) వీసీ సజ్జనర్ (VC Sajjanar) ప్రయాణీకులకు ఓ సూచన చేశారు. పండుగ నాడు పల్లెకు చేరాలన్న ఆత్రుత, మీ ప్రాణాల మీదకు తేకూడదంటూ సోషల్ మీడియాలో ఒక ప్రకటన చేశారు.
“ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా కమ్మేసిన దట్టమైన పొగమంచు.. మృత్యువుకు ముసుగులా మారింది. ఎదురుగా ఏముందో కనిపించని ఈ పరిస్థితిలో డ్రైవింగ్ అత్యంత ప్రమాదకరం. పొగమంచులో సొంత వాహనాల్లో ప్రయాణం వద్దు. తెల్లవారుజామున లేదా అర్ధరాత్రి వేళల్లో సాహసం చేయకండి.
దయచేసి పొగమంచు పూర్తిగా తగ్గి, రోడ్డు స్పష్టంగా కనిపించిన తర్వాతే మీ ప్రయాణాన్ని ప్రారంభించండి. మీ రాక కోసం మీ వాళ్లు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తుంటారు. వారి కళ్లలో ఆనందాన్ని నింపండి.. కన్నీళ్లను కాదు.
- పొగమంచు ఉన్నప్పుడు వాహనం నడపాల్సి వస్తే ఫాగ్ లైట్లు (Fog Lights), ఇండికేటర్లు ఆన్ చేయండి.
- ముందు వెళ్లే వాహనానికి తగినంత దూరం పాటించండి. రోడ్డు ఖాళీగా ఉందని వేగంగా వెళ్లొద్దు.
- గుర్తుంచుకోండి.. ఆలస్యంగానైనా సరే.. క్షేమంగా ఇంటికి చేరడమే నిజమైన పండుగ! “అని పోస్ట్ చేశారు హైదరాబాద్ కొత్వాల్ సజ్జనార్.








