Harish Rao on Gajwel Camp Office Incident | గజ్వేల్లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలోకి కాంగ్రెస్ శ్రేణులు దూసుకెళ్లి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోటోను ఉంచిన ఘటనపై బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
ఈ ఘటనను ఆయన తీవ్రంగా ఖండిస్తూ, ఇది ముమ్మాటికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతోనే జరిగిన దాడి అని ఆరోపించారు. డీసీసీ అధ్యక్షురాలి నేతృత్వంలో జరిగిన ఈ ఉదంతం ప్రజాస్వామ్యంపై సీఎం చేయించిన దాడి అని ఆయన అభివర్ణించారు.
అధికార మదంతో విర్రవీగుతున్న కాంగ్రెస్ నాయకుల తీరు చూస్తుంటే అది రాజకీయ పార్టీలా కాకుండా, బీహార్ గ్యాంగ్ను తలపిస్తోందని హరీష్ రావు ధ్వజమెత్తారు.
శాంతిభద్రతలను కాపాడాల్సిన పోలీసు యంత్రాంగం తీరుపై కూడా ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. పోలీసులు కాంగ్రెస్ పార్టీకి ప్రైవేట్ సైన్యంలా మారిపోయారా? అని ఆయన నిలదీశారు.
పట్టపగలు ఇంతటి దౌర్జన్యం జరుగుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. అధికార పార్టీ అండతో విపక్ష నేతల కార్యాలయాలపై దాడులు చేయడం సరైన పద్ధతి కాదని హితవు పలికారు.
ప్రభుత్వం ఇలాంటి దాడులను వెంటనే ఆపకపోతే, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి ప్రజలే నేరుగా వీధుల్లోకి వచ్చి పోరాడాల్సిన పరిస్థితి వస్తుందని హరీష్ రావు హెచ్చరించారు. ఈ ఘటనతో గజ్వేల్లో రాజకీయ ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరుకున్నాయి.







