క్లారిటీ ఇచ్చిన బంధువులు!
Currency Notes On Bride | ఓ పెళ్లి వేడుక సందర్భంగా వధువుపై కరెన్సీ నోట్ల వర్షం కురిపిస్తున్న వీడయో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పంజాబ్ లోని తర్న్ తరణ్ జిల్లాలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఓ పెళ్లి వేడుకలో వధువు వేదిక వద్ద నిలబడి ఉండగా కుటుంబసభ్యులు ఆమెపై కరెన్సీ నోట్లను వెదజల్లుతున్నారు.
ఈ సందర్భంగా పెళ్లి కుమార్తెపై వారు మొత్తం రూ.8.5 కోట్లు విలువైన కరెన్సీ నోట్లను వెదజల్లారని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. తాజాగా ఈ ప్రచారాన్ని వరుడి కుటుంబం ఖండించింది. పెళ్లి వేడుక సమయంలో డాన్స్ చేస్తున్నప్పుడు సరదాగా డబ్బును వధువుపై వెదజల్లినట్లు వరుడి సోదరుడు తెలిపారు.
సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నట్లుగా రూ.8.5 కోట్ల విలువైన కరెన్సీ నోట్లు వెదజల్లలేదని స్పష్టం చేశారు. కేవలం రూ.2 లక్షల రూపాయాలు మాత్రమే వాడినట్లు వివరణ ఇచ్చారు. తప్పుడు ప్రచారాలు చేస్తున్న సోషల్ మీడియా ఖాతాలపై పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు.









