- రూ. 52 వేల కోట్ల ఆస్తులపై సిట్ దర్యాప్తుకు డిమాండ్!
Pawan Khera allegations against Assam CM Wife | అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వా శర్మ సతీమణి రినికి భుయాన్ శర్మపై కాంగ్రెస్ సీనియర్ నేత పవన్ ఖేరా సంచలన ఆరోపణలు చేశారు.
ఆదివారం ఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రినికి భుయాన్ శర్మకు మూడు విదేశీ పాస్పోర్టులు ఉన్నాయని బాంబు పేల్చారు.
ఆమెకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) గోల్డెన్ కార్డుతో పాటు, అంటిగ్వా అండ్ బార్బుడా మరియు ఈజిప్ట్ దేశాల పాస్పోర్టులు ఉన్నాయని, ఇవన్నీ ప్రస్తుతం చెల్లుబాటులోనే ఉన్నాయని ఆరోపించారు.
భారత రాజ్యాంగం ప్రకారం ద్వంద్వ పౌరసత్వం (Dual Citizenship) చట్టవిరుద్ధమని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.
కేవలం పాస్పోర్టులే కాకుండా, రినికికి అమెరికాలోని వైయోమింగ్లో ఒక కంపెనీ ఉందని, దుబాయ్లో భారీగా ఆస్తులు ఉన్నాయని పవన్ ఖేరా పేర్కొన్నారు.
ఎన్నికల అఫిడవిట్లో ఈ వివరాలను గోప్యంగా ఉంచారని, ఆమె మొత్తం ఆస్తుల విలువ సుమారు రూ. 52,000 కోట్లు ఉంటుందని ఆయన అంచనా వేశారు.
ఈ భారీ అక్రమ ఆస్తులపై సిట్ (SIT) చేత దర్యాప్తు జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ ఆరోపణలు ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టిస్తున్నాయి.
పవన్ ఖేరా చేసిన ఆరోపణలను ముఖ్యమంత్రి హిమంత బిశ్వా శర్మ తీవ్రంగా ఖండించారు. ఇవన్నీ పూర్తిగా అసత్యమని, కేవలం రాజకీయ ప్రేరేపిత ఆరోపణలు మాత్రమేనని కొట్టిపారేశారు.
తన సతీమణితో కలిసి పవన్ ఖేరాపై క్రిమినల్ మరియు పరువు నష్టం దావా వేయనున్నట్లు సీఎం స్పష్టం చేశారు.
ఆధారాలు లేకుండా చేస్తున్న ఇటువంటి విమర్శలపై న్యాయపోరాటం చేస్తామని ఆయన హెచ్చరించారు. అస్సాం ఎన్నికల వేళ ఈ ‘పాస్పోర్ట్ మరియు ఆస్తుల’ వ్యవహారం అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధానికి దారితీసింది.










