- సీఎం రేవంత్ కీలక ప్రతిపాదన!
CM Revanth Propes AI Ministry | దేశ రాజధాని న్యూఢిల్లీలో జరుగుతున్న ‘ఇండియా-ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026’ (India AI Impact Summit- 2026) లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) కీలక ప్రసంగం చేశారు.
దేశంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) విప్లవాన్ని సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లేందుకు జీఎస్టీ కౌన్సిల్ తరహాలో ఒక ‘ఇండియా ఏఐ కౌన్సిల్’ ను, ప్రత్యేక ‘ఏఐ మంత్రిత్వ శాఖ’ ను ఏర్పాటు చేయాలని ప్రధాని నరేంద్ర మోదీని కోరారు.
ఏఐ దుర్వినియోగాన్ని అరికట్టడానికి, జాతీయ భద్రతను కాపాడడానికి బలమైన చట్టపరమైన నిబంధనలు అవసరమని ఆయన స్పష్టం చేశారు.
హైదరాబాద్ను దేశ ఏఐ రాజధానిగా అభివర్ణిస్తూ, జాతీయ ఏఐ పరిణామాలను పర్యవేక్షించేందుకు రాష్ట్రం మరియు కేంద్రం భాగస్వామ్యంతో ఒక ‘నేషనల్ ఏఐ వార్ రూమ్’ ను హైదరాబాద్లో ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు.
అలాగే, దేశ యువత అంతర్జాతీయ స్థాయిలో యూనికార్న్ స్టార్టప్లను నిర్మించేలా ‘నేషనల్ ఏఐ ఫండ్’ ప్రపంచ స్థాయి ‘ఏఐ యూనివర్సిటీ’ అవసరమని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం దేశం కోసం ‘ఏఐ స్టార్టప్ విలేజ్’ ను నెలకొల్పేందుకు సిద్ధంగా ఉందని ఆయన ప్రకటించారు.
భారతదేశం గతంలో పారిశ్రామిక విప్లవాలను అందిపుచ్చుకోలేకపోయిందని, కానీ ఇప్పుడు ఏఐ రంగంలో కేవలం సేవా ప్రదాతగా కాకుండా, చిప్ తయారీ నుంచి అప్లికేషన్ల వరకు గ్లోబల్ లీడర్గా ఎదగాలని పిలుపునిచ్చారు.
ఏఐ వల్ల ఉద్యోగాలు పోతాయన్న భయాలను వీడి, సమగ్ర రీస్కిల్లింగ్ ద్వారా మరిన్ని ఉపాధి అవకాశాలను సృష్టించాలని రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు.










