Capital Amaravati News | ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పనుల పునఃప్రారంభోత్సవానికి రంగం సిద్ధమయ్యింది. శుక్రవారం జరుగుతున్న ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా హాజరవనున్నారు.
ఈ నేపథ్యంలో పునఃప్రారంభోత్సవానికి విచ్చేస్తున్న ప్రధానికి మనఃపూర్వకంగా స్వాగతం పలుకుతున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. రాష్ట్ర ప్రజల కలల రాజధాని నిర్మాణాన్ని సాకారం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారం మరువలేనిదన్నారు.
రాష్ట్రంలో ప్రతి పౌరునికీ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు సృష్టించే ప్రజా రాజధానిగా అమరావతి ఆవిష్కృతం అవుతుందని పేర్కొన్నారు. సంపద సృష్టితో రాష్ట్రానికి ఒక చోదక శక్తిగా నిలబడుతుందని ధీమా వ్యక్తం చేశారు.
ఐదు కోట్ల ఆంధ్రుల ఆకాంక్షలకు ప్రతిరూపంగా రూపుదిద్దుకుంటున్న ప్రజా రాజధాని అమరావతి పున్నిర్మాణాన్ని ప్రధాని మోదీ అమృత హస్తాలతో ప్రారంభిస్తున్నందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు హర్షం వ్యక్తం చేశారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.










