BJP Chief Ramchander Rao News | భారతీయ జనతా పార్టీ తెలంగాణ అధ్యక్షులు రామచందర్ రావు సకాలంలో స్పందించి కారు దగ్ధం అవ్వడంతో అందులోని కుటుంబ సభ్యులను క్షేమంగా గమ్యస్థానానికి చేర్చారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఆయన ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.
వివాహ కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఒక కుటుంబం కారులో సిద్దిపేట నుంచి శంకర్ పల్లి బయలుదేరింది. అయితే పటానచేరు వద్ద ఓఆర్ఆర్ పై సదరు కారులో మంటలు వ్యాపించాయి. అదృష్టవశాత్తు సకాలంలో అందులోని ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. ఆ కొద్దీ సేపటికే ఆ కారు పూర్తిగా దగ్ధం అయ్యింది. ఇదే సమయంలో అటుగా వెళ్తున్న బీజేపీ చీఫ్ కారు దగ్ధం అవ్వడాన్ని గమనించిన తన కారును ఆపేశారు.
బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి వారి స్థితిని అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత బాధితులను సురక్షితంగా గమ్యానికి చేరుకునేలా అవసరమైన ఏర్పాట్లు చేశారు. ప్రజల భద్రత, క్షేమం మన అందరి బాధ్యత అని ఈ సందర్భంగా రామచందర్ రావు పేర్కొన్నారు. ప్రతి ప్రయాణంలో జాగ్రత్త, అప్రమత్తత అత్యవసరమని గుర్తుచేశారు.










