Asaduddin Owaisi says ready to support Nitish govt in Bihar | బీహార్ లో నూతనంగా కొలువుదీరిన బీజేపీ, జేడీయూ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వానికి పూర్తి సహకారం అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ. కానీ ఆయన ఒక షరతు విధించారు.
ఇటీవల వెలువడిన బీహార్ శాసనసభ ఎన్నికల ఫలితాల్లో ఎంఐఎం పార్టీ ఐదు స్థానాలను కైవసం చేసుకున్న విషయం తెల్సిందే. 2020 ఎన్నికల్లో సీమాంచల్ ప్రాంతంలో గెలిచిన ఐదు సీట్లను తిరిగి దక్కించుకుంది. ఈ నేపథ్యంలో తాజగా అమౌర్ లో జరిగిన ఓ సభలో ఒవైసీ పాల్గొన్నారు. సీమాంచల్ ప్రాంతానికి న్యాయం జరిగితే నితీష్ కుమార్ ప్రభుత్వానికి పూర్తి సహకారం అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు హామీ ఇచ్చారు. అభివృద్ధి అనేది కేవలం పట్నా, రాజగిర్ ప్రాంతాలకే పరిమితం కాకూడదన్నారు.
సీమాంచల్ ప్రాంతం నదుల కోత, భారీ ఎత్తున వలసలు వెళ్లడం, తీవ్రమైన అవినీతి వంటి సమస్యలతో సతమతం అవుతుందని పేర్కొన్నారు. ప్రభుత్వం ఈ సమస్యలపై దృష్టి సారించి వాటిని పరిష్కరిస్తే మద్దతు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. కాగా ఒవైసీ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.










