Pawan Kalyan | అంతర్జాతీయ కార్మిక దినోత్సవం మే డే (May Day) సందర్భంగా ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కార్మికులు, శ్రామికులకు శుభాకాంక్షలు తెలిపారు. గురువారం మంగళగిరి సీకే కన్వెన్షన్ లో పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన మేడే వేడుకల్లో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఉపాధి హామీ కార్మికులతో ఆయన మాట్లాడారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ నేటి నుంచి ఉపాధి హామీ కూలీలు కాదు.. ఉపాధి శ్రామికులు అని పిలవాలని సూచించారు. దేశాభివృద్ధికి కృషి చేసే వాళ్లు శ్రామికులవుతారు.. కానీ కూలీలు కాదని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఈ శ్రామికులే లేకపోతే రాష్ట్ర నిర్మాణం, దేశ నిర్మాణం ఉండదన్నారు.
శ్రామికుల కష్టాన్ని, వారి నైపుణ్యాన్ని అర్ధం చేసుకున్న వ్యక్తిని కాబట్టే వారిని కూలీలు అని పిలవకూడదు అని చెబుతున్నాన్నట్లు వ్యాఖ్యానించారు. గతేడాది 24.23 కోట్ల పని దినాలతో 5.10 లక్షల కుటుంబాలకు 100 రోజుల పని కల్పించామని పవన్ కళ్యాణ్ వెల్లడించారు. ఈ ఉపాధి హామీ పథకం కింద రూ. 10,669 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు.