Ambati Rayudu News Latest | టీం ఇండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు సోషల్ మీడియా వేదికగా చేసిన ఒక పోస్టు విమర్శలకు దారి తీసింది.
భారత్-పాక్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. అయితే ఈ సమయంలో అంబటి రాయుడు స్పందిస్తూ..’కన్నుకు కన్ను అంటూ వెళ్తే ప్రపంచమే గుడ్డిదవుతుంది’ అని ట్వీట్ చేశారు. ఈ పోస్టు కాస్తా వైరల్ గా మారడంతో నెటిజన్లు అంబటిపై ఫైర్ అవుతున్నారు.
పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదులే తొలుత అమాయకులపై దాడి చేసి హత్య చేశారనే విషయాన్ని గుర్తుచేస్తున్నారు. భారత్ కేవలం ప్రతిస్పందనగానే ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసిందని పేర్కొంటున్నారు.
పాక్ మరియు ఆ దేశ మద్దతుతో రెచ్చిపోతున్న ఉగ్రవాదులు భారత్ లో కల్లోలం సృష్టించాలని చూస్తుంటే శాంతి ప్రవచనాలు చెప్పడం ఏంటని రాయుడి తీరుపై ప్రశ్నిస్తున్నారు. ఇదే సమయంలో అంబటి రాయుడు మరో పోస్టు చేశారు. ‘న్యాయం జరగాలి కానీ మానవత్వాన్ని మరిచిపోకూడదు.
దేశాన్ని ప్రేమిస్తున్నప్పటికీ గుండెల్లో దయ ఉండాలి’ అంటూ రాసుకొచ్చారు. దింతో నెటిజన్లు అంబటి రాయుడి పై భగ్గుమన్నారు. పాక్ దాడులతో భారత పౌరుల ప్రాణాలు తీస్తున్నా శాంతిగా ఉండాలంటే ఎలా అని బదులిస్తున్నారు. అంబటి రాయుడు చేసిన పోస్టులు సోషల్ మీడియాలో వివాదానికి దారి తీశాయి.
తీవ్ర విమర్శల నేపథ్యంలో అంబటి రాయుడు ‘జమ్మూ కాశ్మీర్, పంజాబ్ మరియు భారత సరిహద్దులలో శాంతి భద్రతలు నెలకొనాలని ప్రార్థిస్తున్నాను. ప్రభావితమైన ప్రతి ఒక్కరికీ బలం, భద్రత మరియు పరిష్కారం లభిస్తుందని ఆశిస్తున్నాను. జై హింద్!’ అని మరో ట్వీట్ చేశారు.
అయినప్పటికీ రాయుడు కేవలం డ్యామేజ్ కంట్రోల్ లో భాగంగానే ఈ పోస్టు చేశారని నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.