AP 10th Results | ఇటీవల వెలువడిన ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి ఫలితాల్లో (AP Tenth Results) ఓ బాలిక అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. కర్నూలు (Kurnool) జిల్లా చిప్పగిరి మండలం, బంటనహాలు గ్రామానికి చెందిన నవీన (Naveena) 10వ తరగతి ఫలితాల్లో 600 మార్కులకు గాను 509 సాధించింది.
అయితే ఆ బాలిక చదువు అంత సాఫీగా ఏమి సాగలేదు. బంటనహాలు గ్రామానికి చెందిన బోయ ఆంజనేయులు, వన్నూరమ్మకు ఇద్దరు పిల్లలు. కుమార్తె నవీన 10వ తరగతి చదువుతుండగా, కుమారుడు రాజు తొమ్మిదవ తరగతి చదువుతున్నారు.
తండ్రి వ్యవసాయ కూలి కాగా, తల్లికి కీడ్ని వ్యాధితో బాధపడుతున్నారు. ఇంట్లో ఆర్థిక పరిస్థితులు అర్థం చేసుకున్న నవీన వారంలో మూడు రోజులు బడికి వెళ్తూ, మరో మూడు రోజులు కూలి పనులకు వెళ్ళేది.
నవీన ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకున్న పాఠశాల ఉపాధ్యాయులు పుస్తకాలు, ఫీజులు అందిస్తూ ఆమెను ప్రోత్సహించారు.
కష్టపడి చదివిన నవీన సోమవారం విడుదలైన పది ఫలితాల్లో ఏకంగా 509 మార్కులు సాధించింది. దీంతో చదువు పట్ల నవీన శ్రద్ధను చూసిన వారు ఆమెను అభినందిస్తున్నారు.