TGSRTC MD Sajjanar | తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) మహాలక్ష్మి పథకం (Mahalaxmi Scheme)లో భాగంగా రాష్ట్రంలోని మహిళలందరికీ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించిన విషయం తెలిసిందే.
బస్సులో ప్రయాణించే మహిళలు ఇప్పటి వరకు తమ అప్ డేటెడ్ ఆధార్ కార్డు చూపించి బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేయవచ్చు. తాజాగా ఈ ఉచిత ప్రయాణానికి సంబంధించి టీజీఎస్ ఆర్టీసీ ఎండీ, వీసీ సజ్జనార్ కీలక ప్రకటన చేశారు.
బస్సులో ఉచితంగా ప్రయాణించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన ఒరిజినల్ ఆధార్, ఓటర్ ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్, తదితర గుర్తింపు కార్డులను ప్రయాణ సమయంలో కండక్టర్లకు చూపించి మహిళలు జీరో టికెట్లను తీసుకోవచ్చని తెలిపారు.
మహాలక్ష్మి-మహిళలకు ఉచిత రవాణా సదుపాయం స్కీమ్ అమలుకు ఆధార్ కార్డు ఒక్కటే ప్రామాణికం కాదని వెల్లడించారు. తెలంగాణాలో మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు జీరో టికెట్ కోసం ఆధార్ ఉంటే చాలా..? కచ్చితంగా అప్డేట్ ఆధార్ కావాలా..? అని ఒక నెటిజన్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఈ ప్రకటన చేశారు వీసీ సజ్జనార్.