Ys Sharmila About Vizag Steel Plant | విశాఖ ఉక్కును చంపడంలో కర్త ప్రధాని మోదీ అయితే ఖర్మ, క్రియ ముఖ్యమంత్రి చంద్రబాబు , డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణే అంటూ విరుచుకుపడ్డారు ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల.
ఓవైపు ప్రైవేటీకరణ ప్రశ్నే లేదంటారు, మరోవైపు అమ్మే నిర్ణయంలో మార్పు లేదంటూ లిఖిత పూర్వక సమాధానం ఇస్తారని మండిపడ్డారు. విశాఖ ఉక్కుపై కేంద్ర ప్రభుత్వానిది రెండు నాలుకల ధోరణి అని దుయ్యబట్టారు.
ఈ మేరకు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయంపై క్లారిటీ కోసం పబ్లిక్ గ్రీవెన్స్కు మాజీ ఉద్యోగి పాడి త్రినాథ్ లేఖ రాశారని, ఆ లేఖపై స్పందిస్తూ..స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయంలో మార్పు లేదంటూ కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ సమాధాన పత్రాన్ని షర్మిల పోస్ట్ చేశారు.
పైకి ఆంధ్రుల హక్కుకు గౌరవం ఉందంటూనే లోపల ప్లాంట్ అమ్మే కుట్రకు మోదీ ఆజ్యం పోస్తూనే ఉన్నారని విమర్శించారు. రూ.11 వేల కోట్ల ప్యాకేజీ ఇచ్చామంటూనే.. లోలోపల ప్లాంట్ ప్రాణం తీస్తున్నారని ధ్వజమెత్తారు. విశాఖ స్టీల్ పై ప్రధాని ఫార్ములా “సైలెంట్ కిల్లింగ్”, కూటమి ప్రభుత్వానిది పచ్చి మోసమని సంచలన వ్యాఖ్యలు చేశారు. విశాఖ స్టీల్ ప్రైవేటీకరణపై ఇప్పటికైనా ప్రధాని మోదీ కుటిల ప్రయత్నాలు మానుకోవాలన్నారు వైఎస్ షర్మిల. వెంటనే స్టీల్ ప్లాంట్ ను SAIL లో విలీనం చేయాలని డిమాండ్ చేశారు.