Telangana Poet AndeSri laid to rest with full state honours | ప్రముఖ కవి, తెలంగాణ రాష్ట్ర గీతం రచయిత అందెశ్రీ సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచిన విషయం తెల్సిందే. మంగళవారం మధ్యాహ్నం హైదరాబాద్ సమీపంలోని ఘట్కేసర్ లో ఆయన అంతిమ సంస్కారాలు జరిగాయి. ఇందులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు పొంగులేటి, దుద్దిళ్ల, అడ్లూరి, జూపల్లి మరియు ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందెశ్రీ పాడెను మోశారు. ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు పూర్తయ్యాయి. అనంతరం మీడియాతో మాట్లాడిన సీఎం..తెలంగాణ సాహితీ శిఖరం అందెశ్రీకి అశ్రు నయనాలతో అంతిమ వీడ్కోలు పలికినట్లు, బరువెక్కిన గుండెతో పాడి మోసి ఆయనతో తనకున్న అనుబంధపు రుణం తీర్చుకున్నట్లు సీఎం ఆవేదనకు లోనయ్యారు.
తెలంగాణ సమాజాన్ని నిత్య చైతన్యవంతంగా ఉంచేందుకు శ్రమించిన ఆయన తెలంగాణ గుండెల్లో ఎప్పటికి మరచిపోలేని జ్ఞాపకంగా ఉంటారన్నారు. “జయ జయహే తెలంగాణ జననీ జయకేతనం” అని పాడే ప్రతి గొంతులో అందెశ్రీ ప్రతిధ్వనిస్తారని పేర్కొన్నారు. అందెశ్రీ ని కోల్పోవడం తెలంగాణ సమాజంతో పాటుగా తనకూ తీరని లోటన్నారు. ‘జయజయహే తెలంగాణ’ గీతాన్ని పాఠ్యంశంగా చేర్చేందుకు మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. అందెశ్రీకి పద్మ శ్రీ ఇవ్వాలని కేంద్రానికి లేఖ రాయనున్నట్లు, వారికి పద్మశ్రీ గౌరవం దక్కేలా కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ సహకరించాలని సీఎం కోరారు.










