Telangana News | తెలంగాణ రాష్ట్రంలోని వలసదారుల మరియు బడుగు, బలహీన వర్గాల సంక్షేమాభివృద్ధికి, వారి జీవనోపాధి అవకాశాలు పెంచేందుకు మద్దతుగా “మొబైల్ వలస సహాయ కేంద్రాన్ని” వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హైదరాబాద్లో ప్రారంభించారు.
ఇది ఐక్యరాజ్య సమితికి చెందిన అంతర్జాతీయ వలస సంస్థ కార్యచరణ ఫలితంగా రూపొందించబడింది. ఈ మొబైల్ వలస సహాయ కేంద్రం (m-MRC) ద్వారా నిజామాబాద్ మరియు నారాయణపేట జిల్లాల్లో వలస వెళ్తున్న గ్రామీణ కుటుంబాలకు… వలసకు ముందు, వలస సమయంలో మరియు తిరిగి వచ్చాక వారి జీవన ప్రమాణాలు పెంచేందుకు అవసరమైన సమాచారం, మార్గదర్శకత్వం, సేవలు అందించబడతాయి.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ “ఈ వాహనాన్ని పూర్తిస్థాయిలో వినియోగించి, ఎంపికచేసిన ప్రాంతాల రైతులకు మట్టి పరిక్షల నిర్వహణ, సేంద్రీయ వ్యవసాయ విధానాలపై, పశు పాలనపై వర్చువల్ శిక్షణలు ఇవ్వాలి” అని సూచించారు.
“ఇక వలస వెళ్ళిన కుటుంబాలలో మహిళలు తరచూ ఇంటిలో ఒంటరిగా మిగిలిపోతున్నారు. అటువంటి మహిళలకు గ్రామాల్లోనే సేవలు అందించేందుకు ఈ మొబైల్ వాహనం ఉపయోగపడుతుంది. ఇది వారిని శక్తివంతం చేయడంలో కీలకపాత్ర పోషిస్తుంది” అని మంత్రి అన్నారు.









