- రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు ప్రారంభం
- గవర్నర్ ప్రసంగం
- అసెంబ్లీ రేపటికి వాయిదా
- శాసనసభకు హాజరైన కేసీఆర్
Telangana Governor Speech | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు (Telangana Budget Sessions) బుధవారం ప్రారంభమయ్యాయి. తొలిరోజు రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. తెలంగాణ ప్రజల కలల సాకారానికే ఈ బడ్జెట్ ప్రవేశ పెడుతున్నామని తెలిపారు.
తెలంగాణలో ప్రస్తుతం ప్రజా పాలన సాగుతోందని, రాష్ట్ర అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. రైతులు, మహిళలు, యువతకు అన్ని విధాలా సహకారం అందిస్తామని పేర్కొన్నారు. రైతుల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని, ఘనమైన సంస్కృతికి నిలయం తెలంగాణ అని అభివర్ణించారు.
“ప్రజల కోసం గద్దర్, అంజయ్య వంటి ఎందరో కృషి చేశారు. జననీ జయకేతనం రాష్ట్ర గీతంగా చేసుకున్నాం. సామాజిక న్యాయం, అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించుకున్నాం. అభివృద్ధి, ప్రగతి వైపు తెలంగాణ అడుగులు వేస్తోంది.
రాష్ట్రానికే రైతులే ఆత్మ వారి అభివృద్ధి కోసం కృషి చేస్తున్నాం. ప్రజల కోసం నిరంతరం శ్రమించే వారే అన్నదాతలు. రాష్ట్ర అభివృద్ధిలో రైతుల భాగస్వామ్యం ఉంది. రైతులకు మద్దతు ఇవ్వడం, వారిని శక్తివంతులుగా తీర్చిదిద్దడం మా ప్రభుత్వం బాధ్యత.
దేశంలోనే అత్యధికంగా ధాన్యం పండిస్తున్న రాష్ట్రం తెలంగాణ. రైతులకు రుణ మాఫీ చేశాం. రైతుల రైతుల పట్ల మా ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనం. 25.35 లక్షల మంది రైతులకు ప్రయోజనం కల్పించాం. ఎకరానికి రూ. 12 వేల చొప్పున రైతులకు అందిస్తున్నాం. రైతు నేస్తం అమలు చేస్తున్నాం.
వరి రైతులకు రూ. 500 చొప్పున బోనస్ ఇస్తున్నాం. రైతుల కోసం వ్యవసాయ కమిషన్ ఏర్పాటు చేశాం. మహాలక్ష్మి గేమ్ ఛేంజర్ పథకం. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్నాం.
తెలంగాణ పురోగమించడమే కాదు.. రూపాంతరం చెందుతోంది. సమ్మిళిత, స్వయం సమృద్ధి, సాధికార తెలంగాణ విజన్తో పని చేస్తున్నాం. అభివృద్ధి, సమృద్ధికి దిక్సూచిగా ఉండేలా తెలంగాణ నమూనా ఉండాలి. తెలంగాణ భౌగోళిక పాత్రమే కాదు.. ఒక భావోద్వేగం. తెలంగాణ స్థిరత్వం, దృఢ సంకల్పానికి గుర్తు. రైతుల స్వేదం, కష్టం మన ప్రజలను పోషిస్తోంది. 260 లక్షల మెట్రిక్ టన్నుల వరి ఉత్పత్తితో దేశం లోనే తెలంగాణ రికార్డు సృష్టించింది.
ఇది మన రైతుల స్థిరత్వం, అంకిత భావానికి ఓ సాక్ష్యం. రూ. 2 లక్షల పంట రుణ మాఫీని అమలు చేస్త్తున్నాం. రుణ మాఫీతో రూ. 20,616.89 కోట్లతో 25.35 లక్షల మంది రైతులకు లబ్ధి కలిగింది. ఇది ప్రభుత్వం చేసిన వాగ్ధానాల నిర్దిష్ట కాల అమలుకు సాక్ష్యం. రైతు భరోసా కింద నేరుగా ఆర్థిక సహాయం అందిస్తున్నాం. ఏడాదికి ఎకరాకు రూ. 12 వేలకు పెంచాం” అని ప్రసంగించారు గవర్నర్ జిష్ణుదేవ్ శర్మ. అనంతరం అసెంబ్లీ గురువారానికి వాయిదా పడింది.
హాజరైన కేసీఆర్..
తెలంగాణ బడ్జెట్ సమావేశాలకు మాజీ సీఎం, ప్రధాన ప్రతిపక్ష నేత కల్వకుంట్ల చంద్ర శేఖర్ రావు హాజరయ్యారు. అధికారం కోల్పోయిన తర్వాత కేసీఆర్ అసెంబ్లీకి రావడం ఇది రెండోసారి.