RGV About Education | దర్శకుడు రాంగోపాల్ వర్మ ఎక్స్ వేదికగా ఆసక్తికరమైన పోస్ట్ చేశారు. విద్య మరణించిందని దీనిని అందరూ సెలబ్రేట్ చేసుకోవాలన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటలీజెన్స్ విస్ఫోటనం విద్య మరణానికి ప్రధాన కారణం అన్నారు.
మెడికల్ విద్యార్థులనే ఉదాహరణ తీసుకుంటే..ఒక వైద్య విద్యార్థి శరీరంలోని అవయవాలు, కండరాలు, నరాల గురించి తెలుసుకుని శరీరంలో ఏ సమస్య వచ్చిందో అర్ధం చేసుకోవడానికి సుమారు దశాబ్దం సమయం పడుతుంది. ఎంబీబీఎస్ ఐదు సంవత్సరాలు, పీజీ మరో రెండు ఏళ్ళు ఆ తర్వాత మరో మూడేళ్లు స్పెషలైజేషన్ కోసం పడుతుందని మరోవైపు ఏఐ మాత్రం అందుబాటులో ఉన్న కోట్లాది వైద్య కేసులను స్కాన్ చేసి క్షణాల వ్యవధిలోనే శరీరంలోని సమస్యను గుర్తించి పరిష్కారం చెబుతోందని ఆర్జీవి పేర్కొన్నారు.
10 సెకండ్లలోనే ఏఐ చేసే పనికి విద్యార్థి 10 సంవత్సరాలు చదవడం ఎందుకని అడిగారు. ఇది అన్ని కోర్సులకు వర్తిస్తుందన్నారు. మన విద్యా వ్యవస్థ జ్ఞాపకశక్తి ఆదరితమైనదని, కానీ ఏఐ క్షణాల్లోనే సమాచారం ఇస్తుంటే విద్యా వ్యవస్థలో జ్ఞాపకశక్తితో పని ఏంటి అంటి ఆర్జీవి ప్రశ్న వేశారు. ఏఐ మూలంగా విద్యార్థులే మొదటి బాధితులు అవుతారన్నారు.
అలాగే విద్యా సంస్థలు చదువును చెబుతున్నట్లు నటించడం మానేసి, విద్యార్థి ఎంత తెలివిగా, సులువుగా, సృజనాత్మకంగా ఏఐని వినియోగిస్తున్నారు అనేది పరీక్షించాలన్నారు. విద్యార్థులు పాత పద్దతిలో చదువుకోవడం మానేయలని ఏఐని ఎలా వినియోగించుకోవాలో నేర్చుకోవాలని కోరారు. ప్రస్తుతం ఆర్జీవి చేసిన పోస్ట్ వైరల్ గా మారింది.










