Man Requests Thief for Bike | మహారాష్ట్రలోని పూణేలో (Pune) ఓ వ్యక్తి తన వాహనాన్ని చోరీ చేసిన దొంగకు ఓ రిక్వెస్ట్ చేశాడు. తన స్కూటీ తిరిగిస్తే కొత్తది కొనిస్తానని ఆఫర్ చేశాడు. దీని వెనక ఓ ఎమోషనల్ స్టోరీ ఉంది.
పూణేకు చెందిన అభయ్ చౌగులే (Abhay Chaugule) అనే యువకుడి బ్లాక్ యాక్టివా కొత్తూరులోని ఛత్రపతి శివాజీ మహరాజ్ విగ్రహం దగ్గర దసరా రోజు చోరీకి గురైంది. సమీప ప్రాంతాల్లో వెతికినా ఫలితం లేకపోవడంతో, అభయ్ దొంగతనం గురించి అధికారిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
మరోవైపు తన ప్రయత్నంగా ఓ వినూత్న రీతిలో వెతుకులాట ప్రారంభించాడు. “నా బ్లాక్ యాక్టివా దసరా రోజు చోరికి గురైంది. అది మా అమ్మ యొక్క చివరి జ్ఞాపకం. దయచేసి దాన్ని వెతకడంలో నాకు సహాయం చేయండి అంటూ వెహికిల్ నంబర్, తన ఫోన్ నంబర్ తో ఓ ఫ్లకార్డు ప్రదర్శించాడు. అంతేకాకుండా దొంగను ఉద్దేశించి మరో పోస్టర్ తో రిక్వెస్ట్ చేశాడు.
“నా యాక్టివాను ఎత్తుకెళ్లిన దొంగకు వినయపూర్వకమైన అభ్యర్థన. మా అమ్మ చాలా కష్టపడి కొన్న బండి అది. అది ఆమె చివరి జ్ఞాపకం. దయచేసి ఇది తిరిగి ఇవ్వండి. నేను మీకు కొత్త వెహికిల్ కొనిస్తాను. దయచేసి మా అమ్మ స్కూటర్ తిరిగి ఇవ్వండి” అంటూ మరో ఫ్లకార్డుపై రాసి JM రోడ్లో నిలబడ్డారు. ఆ ఫోటోలను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసారు. దీంతో అది వైరల్ అవుతోంది.