Pulivendula ZPTC By Elections | పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల పోలింగ్ పై వైసీపీ మరియు టీడీపీ నాయకుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.
ఈ క్రమంలో మాజీ మంత్రి, వైసీపీ నాయకులు అంబటి రాంబాబు సోషల్ మీడియా వేదికగా చేసిన ఒక పోస్ట్ చర్చనీయాంశంగా మారింది. అందులో ఒకే వ్యక్తి పదుల సంఖ్యలో ఓట్లు వేస్తున్నట్లు కనిపించాడు. దింతో పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందని అంబటి పరోక్షంగా ఆరోపించారు. అలాగే ఈ ఎన్నికల ఫలితాలు కోయ ప్రవీణ్ ఐపీఎస్ కు అంకితమని అంబటి విమర్శలు గుప్పించారు.
ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఫాక్ట్ చెక్ విభాగం స్పందించింది. అంబటి పోస్ట్ చేసిన వీడియో పులివెందుల ఎన్నికలకు సంబంధించినది కాదని స్పష్టం చేసింది. 2023 జులైలో పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల తాలూకు వీడియో అని ఫాక్ట్ చెక్ విభాగం పేర్కొంది.
దీన్ని అప్పట్లోనే సుధాంశు వేది అనే వ్యక్తి పోస్ట్ చేసారని తెలిపింది. పశ్చిమ బెంగాల్ వీడియోని ఉపయోగిస్తూ…ఒక డీఐజీ స్థాయి అధికారి మీద అంబటి రాంబాబు ఈ విధంగా పోస్ట్ చేయడం ప్రభుత్వ యంత్రాంగం మీద కుట్రపూరిత ఆరోపణ చేయడం, ప్రజలను తప్పుదోవ పట్టించడం కిందికి వస్తుందని ఫాక్ట్ చెక్ విభాగం పేర్కొంది.
ఇటువంటి ఫేక్ ప్రచారం చేసే వారిపై ఎటువంటి చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయో అటువంటి చర్యలను అంబటి రాంబాబు మీద కూడా తీసుకోబడతాయని స్పష్టం చేసింది.










