Ponguleti Srinivasa Reddy News | తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిన్నరలో కొండంత చేశామని కానీ గోరంత కూడా చెప్పుకోలేకపోతున్నామని పేర్కొన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ది, సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ఏడాదిన్నర కాలంలో ఎన్నోసంక్షేమ పధకాలను అమలు చేస్తూ ముందుకు సాగుతున్నప్పటికీ చేసిన మంచి పనులను ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోతున్నట్లు చెప్పారు.
ప్రభుత్వం సాధించిన ప్రగతికి విస్తృత ప్రచారం కల్పించాలని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. అప్పుడే ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది ప్రజలకు తెలుస్తుందన్నారు. నాడు పదేళ్లు అధికారంలో ఉన్న పార్టీ చెయ్యని పనులను కూడా చేసినట్లుగా గోబెల్స్ ప్రచారంతో ప్రజలను మభ్యపెట్టిందని విమర్శలు గుప్పించారు.
నేడు ప్రతిపక్షంలో కూడా ఆ పార్టీ అదే పద్ధతిని కొనసాగిస్తూ ప్రజల కళ్లకు గంతలు కడుతుందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలను విరివిగా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత జిల్లాస్ధాయిలో పౌరసంబంధాల శాఖ అధికారులదే అని తెలిపారు.
ఈ బాధ్యతను సమర్ధవంతంగా నిర్వహించాలని, ప్రజా సంబంధాల శాఖ సమర్ధవంతంగా పనిచేసిప్పుడే ప్రభుత్వాల పనితీరు ప్రజలకు చేరువవుతుందని అధికారులకు మంత్రి సూచించారు.









