PM Modi’s Big Message Over Pahalgam Attack | “మన్ కీ బాత్” కార్యక్రమంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జమ్మూ కశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రవాద దాడిపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ ఘటనను ఆయన తీవ్రంగా ఖండించారు మరియు బాధిత కుటుంబాలకు న్యాయం జరిగేలా కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రతీ నెలా చివరి ఆదివారం ప్రధాని మన్ కీ బాత్ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తున్నారు. ఇందులో భాగంగా తాజగా 121వ ఎపిసోడ్ లో ప్రధాని ప్రసంగించారు.
పహల్గాం ఉగ్రదాడిలో అమాయక పర్యాటకులు మరణించడం తనను ఎంతగానో కలిచి వేసిందన్నారు. ఉగ్రవాదుల కిరాతక చర్య చూసిన ప్రతి భారతీయుడి రక్తం మరిగిపోతోందని, దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమవుతోందని ప్రధాని పేర్కొన్నారు. ఈ దాడికి పాల్పడిన వారికి కఠిన శిక్ష తప్పదని మోదీ హామీ ఇచ్చారు.
పహల్గామ్లో జరిగిన దాడి ద్వారా ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే వారి నిరాశను, వారి పిరికితనాన్ని తెలియజేస్తుందన్నారు. ఉగ్రవాదులు మరియు వారికి మద్దతు ఇచ్చే వారు కశ్మీర్ను మళ్లీ అశాంతిలోకి నెట్టాలని కోరుకుంటున్నారని, కానీ భారత్ దీన్ని సహించదని స్పష్టం చేశారు.
ఈ ఉగ్రవాద దాడి తర్వాత దేశం మొత్తం ఒకే తాటి పైకి వచ్చిందని 140 కోట్ల భారతీయుల ఐక్యత మరియు మద్దతు ఉగ్రవాదంపై యుద్ధంలో అతిపెద్ద బలంగా ఉందని మోదీ తెలిపారు. పాకిస్థాన్ ప్రేరేపిత
ఉగ్రదాడి దేశ సంస్కృతి, మానవత్వంపై జరిగిన దాడిగా అభివర్ణించారు. అలాగే ప్రపంచ నాయకులు ఈ దాడిని ఖండిస్తూ భారత్కు మద్దతు తెలిపారని మోదీ పేర్కొన్నారు.
బాధిత కుటుంబాలకు న్యాయం జరుగుతుందని మోదీ మరోసారి హామీ ఇచ్చారు. పహల్గాం ఉగ్రదాడికి బాధ్యులైన వారిని కనిపెట్టి, వెంటాడి శిక్షిస్తామని హెచ్చరించారు. కశ్మీర్ అభివృద్ధి, పురోగతిని చూసి ఓర్వలేకే ఉగ్రమూకలు హింసకు పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు.