PM Modi vows action over Delhi blast | దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్ర కోట సమీపంలో సోమవారం సాయంత్రం జరిగిన కారు బ్లాస్ట్ యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ దుర్ఘటనలో ఇప్పటికే 12 మంది వరకు మృతి చెందినట్లు తెలుస్తోంది. వైట్ కాలర్ టెర్రర్ మాడ్యూల్ లో భాగంగానే ఈ పేలుడు జరిపినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. భూటాన్ పర్యటనలో ఉన్న ఆయన ఆ దేశ రాజధాని థింపు లో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రసంగించారు. ఢిల్లీలో జరిగిన భయానక సంఘటన వెనుక ఉన్న కుట్రదారులను వదిలిపెట్టబోమని, బాధ్యులైన వారందరినీ చట్టం ముందు నిలబెట్టడం ఖాయం అని అన్నారు. ఈ సంఘటనను దర్యాప్తు చేస్తున్న సంస్థలతో గత రాత్రంతా సంప్రదింపులు జరిపినట్లు ప్రధాని తెలిపారు.
ఈ కుట్ర వెనుక ఉన్న పూర్తి విషయాలను ఏజెన్సీలు లోతుగా విచారిస్తాయని ఆయన హామీ ఇచ్చారు. తాను భూటాన్కు బరువెక్కిన హృదయంతో వచ్చినట్లు, ఢిల్లీలో సోమవారం సాయంత్రం జరిగి సంఘటన అందరినీ తీవ్రంగా కలచివేసిందన్నారు. బాధిత కుటుంబాల బాధను తాను అర్థం చేసుకున్నానని, ఈ సందర్భంలో మొత్తం దేశం వారికి అండగా నిలుస్తుందని మోదీ తెలిపారు.
మరోవైపు భూటాన్ రాజు జిగ్మే ఖెసార్ నమ్గ్యేల్ వాంగ్చుక్ ఢిల్లీ బ్లాస్ట్ బాధితుల కోసం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. భూటాన్ పౌరులతో కలిసి ప్రార్థనలు నిర్వహించిన రాజు, భారతీయులకు సంతాపం ప్రకటించారు.










