Naa Anveshana News Latest | ప్రముఖ యూట్యూబర్ అన్వేష్ ‘నా అన్వేషణ’ ఛానల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ఇటీవల అన్వేష్ బెట్టింగ్ యాపులకు వ్యతిరేకంగా, వాటిని ప్రమోట్ చేస్తున్న వారి గురించి అనేక వీడియోలు చేశారు.
అయితే తాజగా ఆయన చేసిన వ్యాఖ్యలు మాత్రం వివాదాస్పదంగా మారాయి. తెలంగాణ చీఫ్ సెక్రటరీ, డీజీపీ మరియు హైదరాబాద్ మెట్రో ఎండీ పై అన్వేష్ ఆరోపణలు చేయడం సంచలనంగా మారింది. మెట్రో రైళ్లలో బెట్టింగ్ యాపుల ప్రమోషన్స్ వెనుక ఉన్నతాధికారులు ఉన్నారని అతను ఆరోపించారు.
రాష్ట్ర చీఫ్ సెక్రటరీ శాంతికుమారి, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డిజిపి) జితేందర్ రెడ్డి, మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి లతో పాటు మరికొందరు ఐఏఎస్, ఐపిఎస్, ఇతర ఉన్నతాధికారులపై అన్వేష్ అవినీతి ఆరోపణలు చేసాడు. వీరంతా కలిసి బెట్టింగ్ యాప్స్ నిర్వహకులతో కుమ్మక్కయి రూ.300 కోట్లు కొట్టేసారంటూ అన్వేష్ ఒక వీడియోలో చెప్పాడు.
ఈ నేపథ్యంలో యూట్యూబ్ వీడియోల ద్వారా అన్వేష్ ఉన్నతాధికారులపై తప్పుడు ప్రచారం చేస్తున్నాడంటూ సైబరాబాద్ పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేసారు. ప్రభుత్వం, చట్టబద్ద సంస్థలపై అన్వేష్ చేస్తున్న ఆరోపణలు ప్రజల్లో గందరగోళం సృష్టించేలా ఉన్నాయని, ద్వేషాన్ని కలగించేలా ఉన్నాయంటూ సైబర్ క్రైమ్ కానిస్టేబుల్ ఫిర్యాదు చేసారు. దీంతో సుమోటోగా కేసు నమోదు చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. అతడిపై తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.










