Maharashtra Woman Doctor’s Suicide Note On Hand | మహారాష్ట్రలో ఓ మహిళా డాక్టర్ ఇద్దరు పోలీసు అధికారులు తనను లైంగికంగా వేధిస్తున్నారని ఆరోపిస్తూ ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. రాష్ట్రంలోని బీడ్ జిల్లాకు చెందిన సదరు డాక్టర్ సతారా జిల్లా ఫల్టాన్ ప్రాంతంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యురాలిగా పనిచేస్తున్నారు.
అయితే ఆమె గురువారం ఓ హోటల్ గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఇది గమనించిన సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడికి వచ్చిన పోలీసులు వైద్యురాలి అర చేతిపై సూసైడ్ నోట్ ను గమనించారు. ఇందులో మహిళా డాక్టర్ సంచలన ఆరోపణలు చేశారు. సతారా జిల్లాలోని ఎస్సై గోపాల్ బదానే గత ఐదు నెలల్లో తనను నాలుగు సార్లు అత్యాచారం చేసినట్లు పేర్కొన్నారు.
అలాగే నిత్యం లైంగికంగా వేదిస్తున్నట్లు రాశారు. మరో పోలీసు ప్రశాంత్ బంకర్ తనను మానసికంగా వేధిస్తున్నట్లు వైద్యురాలు సూసైడ్ నోట్ లో తెలిపారు. ఈ నేపథ్యంలో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ పరిణామాల క్రమంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ సతారా జిల్లా ఎస్పీతో మాట్లాడారు. వెంటనే ఆరోపణలు ఎదురుకుంటున్న పోలీసులను సస్పెండ్ చేయాలని ఆదేశించారు.










