Maharashtra Village Declares Itself Caste-Free | మహారాష్ట్రలోని అహిల్యానగర్ జిల్లా, నేవాసా తాలూకాలో ఉన్న సౌందలా గ్రామం ఇటీవల చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ఇటీవల జరిగిన గ్రామసభ సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానం ఆమోదించి, గ్రామాన్ని ‘కుల రహిత గ్రామం’గా ప్రకటించుకుంది. దేశ చరిత్రలో ఇలా ప్రకటించిన గ్రామం ఇదే మొదటిది కావొచ్చని పలువురు విశ్లేషకులు పేర్కొన్నారు. గ్రామ పంచాయతీ సభ్యులు, సర్పంచ్, ఉప సర్పంచ్, వివిధ కులాలకు చెందిన గ్రామస్తులు, ముస్లింలు కూడా ఈ తీర్మానానికి మద్దతిచ్చారు.
గ్రామసభలో ప్రతిపాదన చేసిన గ్రామస్తుడు అర్గడే మాట్లాడుతూ, భారత రాజ్యాంగ పీఠికలోని స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం విలువలను ఆధారంగా చేసుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. గ్రామంలో ఎవరూ కులం, మతం, వంశం ఆధారంగా వివక్ష చూపకూడదని అంటరానితనం, సామాజిక అసమానతలు పూర్తిగా నిర్మూలించాలని తీర్మానించారు. “మా కులం మానవత్వం” అనే భావనను అవలంబిస్తామని ఆయన స్పష్టం చేశారు. అలాగే కుల ఆచారాలు పాటించిన వారిపై గ్రామ పంచాయతీ చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు.









