LIC investment in Adani group | ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ ఆదాని మరో వివాదంలో చిక్కుకున్నారు. ఈ మేరకు అమెరికా కు ప్రఖ్యాత ‘వాషింగ్టన్ పోస్ట్’ ప్రచురించిన కథనం కలకలం రేపుతోంది. ఆదాని ని కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం ఎల్ఐసీ ద్వారా ఆయన కంపెనీల్లో 3.9 బిలియన్ డాలర్లు అంటే రూ.34,000 కోట్లకు పైగానే పెట్టుబడులు పెట్టించిందని వాషింగ్టన్ పోస్ట్ పేర్కొంది.
భారతదేశంలో సోలార్ ప్రాజెక్టులను దక్కించుకునేందుకు ఆదాని కంపెనీ 250 మిలియన్ డాలర్ల డబ్బులను భారతీయ అధికారులకు, రాజకీయ నాయకులకు లంచంగా ఇచ్చినట్లు అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. దీనిపై అమెరికా లో ఆదానితో సహా ఎనమిది మందిపై క్రిమినల్ కేసు నడుస్తోంది. ఈ నేపథ్యంలో అమెరికన్, యూరోపియన్ బ్యాంకులు ఆదాని కంపెనీకి లోన్లు ఇచ్చేందుకు నిరాకరించాయి. ఈ తరుణంలోనే కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని వాషింగ్టన్ పోస్ట్ తెలిపింది. ఆర్ధిక మంత్రిత్వ శాఖ, నీతి ఆయోగ్ ద్వారా ఒత్తిడి చేసి ఎల్ఐసీ ని ఆదాని కంపెనీల్లో పెట్టుబడులు పెట్టించినట్లు కథనాల సారాంశం.
ఇలా ఏకంగా 3.9 బిలియన్ డాలర్లు అంటే సుమారు రూ.34,000 కోట్లను ఎల్ఐసీ ఆదాని కంపెనీలో పెట్టుబడి పెట్టినట్లు వాషింగ్టన్ పోస్ట్ చేసిన కథనం భారత్ లో ప్రకంపనలు సృష్టించింది. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ తీవ్రస్థాయి విమర్శలు గుప్పించింది. ఇది మోదాని మెగాస్కామ్ అని ఆరోపించింది. 30 కోట్ల మంది భారతీయులు ఎంతో నమ్మకంతో ఎల్ఐసీ లో పెడితే వాటిని తీసుకెళ్లి ఆదాని కంపెనీలో పెట్టుబడి పెట్టడం ఏంటని నిలదీసింది.









