Kumbhmela Scam Alert | ఉత్తర్ ప్రదేశ్ (Uttar Pradesh)లోని ప్రయాగ్ రాజ్ (Prayag Raj)లో ప్రపంచంలోనే అతి పెద్ద ఆధ్యాత్మిక సమ్మేళనం మహా కుంభమేళా (Maha Kumbhmela 2025) జరుగుతున్న సంగతి తెలిసిందే.
144 ఏళ్లకు ఒకసారి వచ్చే ఈ మహా కుంభమేళా జనవరి 13న ప్రారంభమైంది. 45 రోజులపాటు కొనసాగి ఫిబ్రవరి 26న ముగుస్తుంది. మన దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాలతోపాటు వివిధ దేశాల నుంచి కూడా వచ్చి ఈ కుంభమేళాలో పవిత్ర స్నానం ఆచరిస్తున్నారు. ఇప్పటికే దాదాపు 50 కోట్ల మంది ఈ కుంభమేళాలో పాల్గొన్నట్లు అంచనా.
ఇదిలా ఉండగా, కుంభమేళాలో భారీ జనసందోహాన్ని కొంతమంది తమకు వ్యాపార అవకాశంగా మలుచుకుంటున్నారు. ఇటీవల ఓ వ్యక్తి కుంభమేళాలో వేప పుల్లలు విక్రయించి రూ.40 వేలు సంపాదించినట్లు, మరోవ్యక్తి కుంభమేళాలో సెల్ఫోన్లకు ఛార్జింగ్ పెట్టి డబ్బులు సంపాదించిన ఘటనలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
అయితే తాజాగా వీటన్నింటికీ మించి మరో ఆసక్తికర ప్రకటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కుంభమేళాలో పాల్గొనలేని వారిని టార్గెట్ చేసుకొని ఓ వ్యక్తి వైరటీ ఆఫర్ తో ముందుకొచ్చాడు. మీరు ఎక్కడ ఉన్నా మహా కుంభమేళాలో పుణ్యస్నానం చేపిస్తానని ఏకంగా పోస్టర్లు వేయించాడు.
ఆ పోస్టర్లను సోషల్ మీడియాలోనూ వైరల్ చేశాడు. రూ. 500 చెల్లించి, వాట్సాప్లో ఫోటో పంపిస్తే గంగా, యమునా, సరస్వతి నదుల త్రివేణి సంగమంలో పుణ్యస్నానం జరిపిస్తానని ఆఫర్ ఇచ్చాడు. ఆ ఫోటోను ప్రింట్ తీసి.. త్రివేణి సంగమం వద్ద నీళ్లల్లో ముంచితే పుణ్య స్నానం పూర్తయినట్లేనని.. పుణ్యం వస్తుందని తెలిపాడు.
కుంభమేళాలో పుణ్యస్నానాలు చేయలేని వారికి గోల్డెన్ ఛాన్స్ అంటూ రాసుకొచ్చాడు. 144 సంవత్సరాలకు ఒకసారి వచ్చే మహా కుంభమేళాలో పుణ్యస్నానాలు చేయాలని చాలా మంది కోరుకుంటారు కానీ.. అక్కడి వరకు వెళ్లేలేని వారి కోసం ఈ అవకాశం అంటూ ఆ పోస్టర్లో వెల్లడించాడు.
ప్రస్తుతం ఈ ప్రకటన సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అది చూసిన నెటిజన్లు విభిన్న కామెంట్లు చేస్తున్నారు. ఇలా కూడా మహా కుంభమేళాలో పుణ్యస్నానాలు చేయిస్తారా అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇలాంటి ఫేక్ మెసేజ్లతో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.
