- ఖమ్మంలో కాలేజీల అల్టిమేటం
– లేదంటే సర్టిఫికేట్ ఇవ్వడానికి నిరాకరణ
– విద్యార్ధుల ఆగ్రహం
ఖమ్మం: జిల్లాలో పలు ఫార్మసీ కాలేజీలు విద్యార్థులను ఇబ్బందులు పెడుతున్నాయి. బీ ఫాం, ఫాం డీ పూర్తి చేసిన విద్యార్థులకు సర్టిఫికేట్లు ఇచ్చే సమయంలో వారి నుంచి బ్లాంక్ చెక్కులను స్వీకరిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.
ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ ఆలస్యం చేస్తుండటంతో ఖమ్మంలోని కళాశాలలు స్టూడెంట్స్ నుంచి బ్లాంక్ చెక్కులను అడుగుతున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు. దీనిపై విద్యార్థులు తల్లిదండ్రులు కాలేజీలో తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఫీజు రీయింబర్స్మెంట్ ఆలస్యం..
ఆర్థికంగా వెనుకబడిన తరగతుల విద్యార్థుల ఉన్నత విద్య కోసం తెలంగాణ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ పథకం అమలు చేస్తోంది. దీనికి అర్హులైన విద్యార్థులు ట్యూషన్ ఫీజుల భారం లేకుండా చదువు కోవచ్చు. కాలేజీ ఫీజులో నిర్ణీత మొత్తాన్ని ప్రభుత్వం ఇస్తుంది. మిగిలిన మొత్తం విద్యార్థి భరించాలి.
అయితే తెలంగాణ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్ నిధుల విడుదలలో జాప్యం చేస్తోంది. దీంతో కాలేజీలు ఈ భారాన్ని విద్యార్థులపై మోపేందుకు సిద్ధమైనట్లు ఆరోపణలు వస్తున్నాయి. అధ్యాపకుల జీతాలు, మౌలిక సదుపాయాల నిర్వహణ మరియు రోజువారీ నిర్వహణ ఖర్చులు వంటి నిర్వహణ ఖర్చులను కవర్ చేయడానికి సంస్థలు విద్యార్థుల నుంచి పూర్తి ఫీజు వసూలు చేసేందుకు పూనుకున్నట్లు తెలుస్తోంది.
గ్రాడ్యుయేషన్ పూర్తయి సర్టిఫికేట్లు ఇచ్చే సమయంలో కాలేజీ యాజమాన్యాలు విద్యార్థుల నుంచి బ్లాంక్ చెక్కులను డిమాండ్ చేస్తున్నాయి. ఫీజు రియింబర్స్ మెంట్ మరింత జాప్యం అయితే ఆ చెక్ లపై ఫీజు మొత్తం వేసి, బ్యాంకుల నుంచి విత్ డ్రా చేసుకునే ఆలోచనలో ఉన్నాయని పలువురు విద్యార్థులు చెబుతున్నారు. పైగా ఫీజు రీయింబర్స్ మెంట్ సకాలంలో రాకపోవడం వల్ల కాలేజీల నిర్వహణకు ఇది తప్పదని వాదిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఇలా బ్లాంక్ చెక్కులు ఇవ్వడం వల్ల తాము భవిష్యత్తులో ఇబ్బందుల్లో పడే ప్రమాదం ఉందని విద్యార్థులు వాపోతున్నారు. “మేము ఇప్పటికే మా ఫీజు కోసం చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఇప్పుడు కాలేజీ యాజమాన్యాలు బ్లాంక్ చెక్కును ఇవ్వాలని షరతులు పెడుతున్నారు. ఆ చెక్ ను దుర్వినియోగం చేయరని ఎలా నమ్మగలం?” అని ఓ విద్యార్థిని వ్యాఖ్యానించింది. విద్యార్థులు బ్లాంక్ చెక్ లు ఇవ్వడం భవిష్యత్తులో ఇబ్బందులను కొని తెచ్చుకోవడమేనని ఓ ప్రముఖ న్యాయవాది తెలిపారు. ఇది పూర్తి అనైతికమన్నారు.
ప్రభుత్వంపై ఒత్తిడి..
కాలేజీల తీరుపై పలు విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఖమ్మం అంతటా నిరసనలు నిర్వహిస్తామని విద్యార్థి సంఘాలు హెచ్చరించాయి. కాలేజీ మెనేజ్ మెంట్స్ విద్యార్థుల నుంచి బ్లాంక్ చెక్స్ తీసుకోవద్దని సూచించాయి. ప్రభుత్వం కూడా వెంటనే విద్యార్థుల ఫీజు రీయింబర్స్ మెంట్ నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశాయి.
మరోవైపు తెలంగాణలో రాజకీయాలను శాసించే కేంద్రంగా ఉన్న ఖమ్మంలో కాలేజీలు ఇలా విద్యార్థులను ఇబ్బందులు పెట్టడం సరికాదనే అభిప్రాయాలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి కళ్లు మూసుకున్నారని విద్యార్థులు, తల్లిదండ్రులు విమర్శలు చేస్తున్నారు.